సెన్సార్ అంతా ఆన్లైన్ లో జరగాలి : సురేశ్ బాబు
హైదరాబాద్: చిత్ర నిర్మాణం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిందని, దీనిపై ఆధారపడి లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అన్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డులో చిత్ర ధ్రువీకరణ ప్రక్రియ ను మరింత వేగవంతం చేస్తే పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిత్ర పరిశ్రమ వాణిజ్యాన్ని మరింత సరళతరం, సౌకర్యవంతం చేసేలా కేంద్ర చిత్ర ధ్రువీకరణ సంస్థ (సీబీఎఫ్సీ) తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సెన్సార్ బోర్డుకు నూతనంగా నియమితులైన సలహా బృందం సభ్యులు(అడ్వైజరీ ప్యానెల్ మెంబర్లకు హైదరాబాద్ సీబీఎఫ్సీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ఒక రోజు కార్యశాల(వర్కు షాప్) / శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గుబాటి సురేశ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్ లైన్ ధ్రువీకరణ ఇచ్చే విషయంపై సీబీఎఫ్సీ ఆలోచించాలని సూచించారు. చిత్ర ప్రకటనలు, ప్రోమోలు సర్టిఫికెట్ పొందిన తర్వాతే టీవీల్లో విడుదల చేయాలని నిర్మాతలకు సురేశ్ బాబు సూచించారు. ఈ విషయంలో నిర్మాతల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని సీబీఎఫ్సీ త్వరితగతిన సర్టిఫికేట్ జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు.
కార్యక్రమంలో హైదరాబాద్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి టి.విజయ్ కుమార్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. రాజ్యాంగం ప్రకటించిన భావ ప్రకటన స్వేచ్ఛకు లోబడి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, మనుషుల మనోభావాలను దెబ్బతీయని విధంగా ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. చిత్రాల విషయంలో సెన్సార్ వివాదాలు తలెత్తకుండాఉండాలంటే స్వీయ సెన్సార్ షిప్ దిశగా నిర్మాతలు, దర్శకులు దృష్టి సారించాలని సూచించారు.
సమాజంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసే సినిమా మాధ్యమంపై కొంత నియంత్రణ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. సెన్సార్ బోర్డుకు వచ్చే చిత్రాలను చూసే సమయంలో సభ్యులంతా తమ వ్యక్తిగత భావజాలం, సిద్ధాంతాలు,రాజకీయాల కోణంలో చూడొద్దని సూచించారు. సినిమా వినోదంతో కూడిన మాధ్యమం అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తమ వంతుగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేశామన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు సెన్సార్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. సెన్సార్ బోర్డును పునర్వ్యవస్థీకరించేందుకు శ్యాం బెనగల్ నేతృత్వంలో వేసిన కమిటీ అందరి ప్రయోజనాలు కాపాడుతుందని ఆకాంక్షించారు. సెన్సార్ బోర్డు, చిత్ర పరిశ్రమ కలసిమెలసి పనిచేయాలని అభిలషించారు.

జీవిత
కార్యక్రమంలో కేంద్ర సెన్సార్ బోర్డు డెలిగేటెడ్ సభ్యురాలు, సినీ నటి జీవితారాజశేఖర్ మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు నూతన సభ్యులకు ఇలాంటి వర్కుషాప్ వల్ల ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రచయితలు, నిర్మాతలు, దర్శకులతోనూ ఇలాంటి వర్కుషాప్ లు నిర్వహిస్తే ఉపయుక్తం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొన్ని సినిమాలు విడుదలకు ఒకటి రెండు రోజుల ముందు సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డు వద్దకు వస్తుండటం వల్ల అధికారులు, సభ్యులపై తీవ్ర ఒత్తిడి ఉంటోందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వరుస క్రమంలో సెన్సార్ కు పంపించే వ్యవస్థ ఉంటే ఇంకా బాగుంటుందని సూచించారు.

పరుచూరి
ఈ కార్యశాలలో ప్రముఖ రచయిత, రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. కులాలు, ప్రాంతాలు, మతాలను కించపరిచేలా రచయితలు సంభాషణలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు. రచయితల కలం వ్యవస్థలో మార్పును తీసుకురాగలుగుతుందని, అయితే సెన్సార్ బోర్డు నిబంధనల గురించి రచయితలకు కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుందన్నారు.

తేజ
తేజ కార్యక్రమంలో సినీ దర్శకుడు, నిర్మాత తేజ మాట్లాడుతూ.. చిత్ర సెన్సార్ విషయంలో ఏకీకృత విధానం ఉంటే బాగుంటుందన్నారు. హిందీ చిత్రాల్లో అశ్లీల సన్నివేశాలకు అనుమతి ఇస్తూ.. ప్రాంతీయ భాషల్లో సెన్సార్ విధించడం సరికాదన్నారు. ఇలాంటి అసమానతలను తొలగించాలని కోరారు.

మురళీ
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ కార్యదర్శి మురళీ మోహన్ మాట్లాడుతూ.. కొత్త చిత్రాలపై సెన్సార్ బోర్డు సభ్యుల అభిప్రాయాలు అంటూ వివిధ మాధ్యమాల్లో వచ్చే సమీక్షల వల్ల నిర్మాతలకు నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు కొత్త చిత్రాలపై తమ అభిప్రాయాలను బహిర్గత పరచొద్దని కోరారు. ఈ వర్కుషాప్ లో సెన్సార్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











