తమ్ముడు పవన్ మూవీకి నష్టంపై చిరంజీవి ఇలా..!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురై నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవి స్పందించారు. పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పైరసీ వ్యాప్తి చెందకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మరో వైపు....అన్నయ్య చిరంజీవి రాజకీయ వ్యవహారాల్లో ప్రవర్తించే తీరు కారణంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాను ఇటు తెలంగాణ ప్రాంతంలో, అటు సీమాంధ్ర ప్రాంతంలోనూ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. తన కారణంగా తమ్ముడు సినిమాకు నష్టం వాటిల్లడంపై కూడా చిరంజీవి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉద్యమకారుల విషయంలో చిరంజీవి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి రెండు ప్రాంతాల ఉద్యమాలు ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లు తయారయ్యాయి. అందుకే ఆయన ఈ తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల జోలికి పోకుండా కేంద్ర పర్యాటక శాక మంత్రిగా తన విధుల్లో మునిగితేలుతున్నారు.
కాగా, ఈ రోజు విడుదలైన అత్తారింటికి దారేది చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












