Chiranjeevi: గరికపాటిపై చిరంజీవి సెటైర్.. కామెడీ టైమింగ్ తో నవ్వించిన బాస్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద కొడుకులా పాటుపడుతుంటారు. సుమారు 4 దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రంతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన ఆయన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి కౌంటర్ గా నవ్వించేలా చిరంజీవి ఓ గరికపాటిపై ఓ జోక్ వేశారు.

తనదైన శైలీలో ఛలోక్తులు..
నాలుగు దశాబ్ధాలుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక చిరంజీవి స్పీచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన స్టేజ్ పై మాట్లాడేటప్పుడు తనదైన శైలీలో ఛలోక్తులు విసిరి నవ్విస్తారు.

పరోక్షంగా సెటైర్ వేసి..
ఇటీవల అల్లు స్టూడియోస్ ప్రారంభం కార్యక్రమంలో ఆయనకు, అల్లు రామలింగయ్యకు ఉన్న అనుబంధాన్ని చాలా కామెడీగా చెప్పారు. అలాగే తాజాగా జరిగిన ''శూన్యం నుంచి శిఖరాగ్రాలకు'' అనే పుస్తకావిష్కరణలో తను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న విషయం చెప్పి అందరినీ నవ్వించారు. అదే కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై పరోక్షంగా సెటైర్ వేసి అందరూ నవ్వేలా చేశారు.

చిరంజీవితో ఫొటోలు దిగేందుకు..
గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి వివాదం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితోపాటు గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే గరికపాటి ప్రవచనాలు చెప్పే సమయంలో పలువురు మహిళలు, పిల్లలు చిరంజీవితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.

ఇక్కడి నుంచి నేను వెళ్లిపోతాను..
చిరంజీవితో మహిళలు, పిల్లలు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించే సమయంలో అదంతా చూసిన గరికపాటి మైక్ అందుకుని ''చిరంజీవి గారు మీ ఫొటోషూట్ ఆపి వెంటనే వచ్చి కూర్చోవాలి. లేకపోతే నిర్మోహమాటంగా ఇక్కడి నుంచి నేను వెళ్లిపోతాను'' అని రెండు మూడు సార్లు గట్టిగానే అన్నారు. గరికపాటి వ్యాఖ్యలపై చిరు అభిమానులే కాకుండా నాగబాబు, ఆర్జీవీ విరుచుకుపడ్డారు. ఈ వివాదం కొద్దిరోజులు అయ్యాక సద్దుమణిగింది.

చేతి వేలిని పైకి చూపిస్తూ..
అలా సద్దుమణిగిన వివాదాన్ని తాజాగా చిరంజీవి మళ్లీ తట్టిలేపినట్లయింది. తాజాగా సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు రచించిన ''శూన్యం నుంచి శిఖరాగ్రాలకు'' పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి స్టేజి పైకి వెళ్లారు. చిరంజీవికి పుష్పగుచ్ఛం అందించాక పలువురు ఆయనతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా చిరంజీవి.. 'ఇక్కడ వారు లేరు కదా' అని చేతి వేలిని పైకి చూపిస్తూ అన్నారు.
వీడియో వైరల్..
చిరంజీవి అలా అనడం పరోక్షంగా గరికపాటి నరసింహారావును గుర్తు చేసినట్లే అయింది. చిరంజీవి అలా అనడంతో అక్కడ అంతా నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో చిరంజీవి హ్యూమర్ మరోసారి బయటపడిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











