Ticket Prices Issue: టికెట్ రేట్ల వివాదంపై చిరంజీవి ట్వీట్.. సీఎంకు థ్యాంక్స్ అంటూ ఊహించనివ విధంగా!
తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో సినిమా టికెట్ రేట్ల వివాదం ఒకటి. సామాన్యులకు వినోదాన్ని తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల వల్ల ఏపీలో విడుదల అవుతోన్న సినిమాలకు మంచి కలెక్షన్లు రావడం లేదు. అదే సమయంలో థియేటర్ యాజమాన్యాలకు కరెంట్ బిల్లులకు సరిపోను ఆదాయం రావడం కూడా గగనం అయిపోయింది. కానీ, తెలంగాణలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తాజాగా దీనిపై ట్వీట్ చేసి సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. ఆ వివరాలు మీకోసం!

షాకింగ్గా జీవో జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను కొన్ని థియేటర్లు దోచుకుంటున్నాయని, ప్రతి ఒక్కరికీ వినోదాన్ని తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. రాష్ట్రంలోని థియేటర్లలో ఏరియాను బట్టి రేట్లను నిర్ణయించారు. ఆ ధరలకే టికెట్లు అమ్మాలని కఠినంగా పేర్కొన్నారు.

కోర్టుకు వెళ్లడంతో.. వాళ్లపై చర్చలతో
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటీషనర్లకు వెసలుబాటు కల్పించిన న్యాయస్థానం.. రేట్ల పెంపునకు జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని సూచించింది. అలా తీసుకోని థియేటర్లపై దాడులు చేస్తూ సీజ్ చేస్తున్నారు అధికారులు.

అక్కడ మాత్రం మరింత వెసలుబాటు
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలా ఉంటే.. తెలంగాణలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త సినిమాల విడుదల సమయంలో బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. టికెట్ రేట్లను కూడా పెంచుకోవచ్చని చెప్పింది. అలాగే, పార్కింగ్ ఫీజును సైతం పెంచడానికి పర్మీషన్ ఇచ్చేసింది. దీంతో నైజాం ఏరియాలో అన్ని సినిమాలకూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

టికెట్ రేట్లు నిర్ణయించిన ప్రభుత్వం
తెలంగాణలోని సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా.. వాటిని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం టికెట్ రేట్లు నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జీవో నెంబర్ 120 జారీ చేశారు.

టికెట్ రేట్లను ఎంత ఫిక్స్ చేశారంటే
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 120 ప్రకారం.. ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో సినిమా టికెట్ కనిష్ట ధర రూ.50 కాగా, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. వీటికి జీఎస్టీ అదనం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30 కాగా, గరిష్టంగా రూ.70గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్ల్లో టికెట్ కనీస ధర రూ.100 ప్లస్ జీఎస్టీ.. గరిష్టంగా రూ.250 ప్లస్ జీఎస్టీగా ఖరారు చేశారు.

టికెట్ రేట్ల వివాదంపై చిరు స్పందన
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల వివాదం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సినీ పరిశ్రమలోని పెద్దలంతా దీనిపై స్పందించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తెలంగాణలోని టికెట్ల రేట్లపై టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు థ్యాంక్స్ చెప్పారు.

పరోక్షంగా పంచ్ వేసిన చిరంజీవి
చిరంజీవి తన ట్విట్టర్లో 'తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి థ్యాంక్స్. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది' అంటూ పేర్కొన్నారు. దీంతో మరో సీఎంకు పంచ్ వేసినట్లైంది.


Click it and Unblock the Notifications











