మల్టీ స్టార్స్ పై మక్కువ చూపుతున్న సూపర్ స్టార్స్...!?
ఈ మధ్య తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీ స్టారర్ మూవీస్ మీద శ్రద్ద పెరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే అప్పుడు మన హీరోలు మల్టీస్టారర్ సినిమాలపై పడ్డారు. తెలుగు ప్రేక్షకులు ఎన్నాళ్లగానో ఎదురుచూసే తరుణం రానేవచ్చింది. ఎప్పుడో ఎఎన్నాఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబులతో తెరమరుగైన ఇద్దరు కథానాయకుల కథలు మళ్లీ తెరపైకి వచ్చే తరుణం ఆసన్నమైంది.
ఒకప్పుడు అక్కినేని, నందమూరి హీరోలు ఈగోలకు తావులేకుండా మాస్, క్లాస్ అనే భేషజం లేకుండా ఇద్దరూ ఎక్కువా లేక తక్కువ అనే ఫీలింగ్ లేకుండా నటించేవారు. అదే వారసత్వాన్ని కృష్ణ, శోభన్ బాబులు కూడా కొనసాగించారు. చిరంజీవి హయాం వచ్చేసరికి ఈ మల్టీస్టారర్ల శకానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. చిరంజీవితో కలిసి నటించిన హీరోలను వేళ్లమీద లెక్కపెట్టుకోవాలి. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్ ల హయాంలో సాంతం అటకెక్కేసింది.
ప్రస్తుత హీరోలలో మాత్రం మల్టీస్టారర్లుగా చేసే అభిరుచి కనుచూపుమేరలో కనిపిస్తోంది. కాగా ఈ అంశానికి ముందుగా తెరతీసిన ఘనత మాత్రం హీరోలు వెంకటేష్, మహేష్ బాబులకే దక్కుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"గా చెప్పుకుంటున్న ఈ చిత్రం మరో రెండు నెలలలో కార్యరూపం దాలుస్తుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు హీరో వెంకటేష్కు తమ్ముడి పాత్రలో నటించడం విశేషం.
నటరత్న నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హీరో మనోజ్ తో కలిసి ఒక ప్రత్యేక పాత్రలో 'ఊకొడతారా...ఉలిక్కిపడతారా" చిత్రంలో పోషించడం పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. శ్రీరామరాజ్యంలో ఆల్రెడీ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, షారూక్ ఖాన్ నటించిన 'రా..వన్" చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్నారు.
రామ్చరణ్తో కలిసి అల్లు అర్జున్ కూడా ఒక ప్రత్యేకపాత్రలో నటించే చిత్రం త్వరలో తెరపైకి రానున్నట్లు సమాచారం. ఇవిగాక ఇంకా జూ ఎన్టీఆర్, నాగచైతన్యల 'గుండమ్మ కథ" చిత్రం కూడా ఏమీ వెనక్కి వెళ్లలేదు. త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











