దాసరి నారాయణరావు 'యంగ్ ఇండియా' స్టార్ట్
ప్రముఖ దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు 'యంగ్ ఇండియా' షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది.ఇది ఆయనకు దర్శకుడుగా 149 వ చిత్రం. దాదాపు 81 మంది నూతన నటీనటులతో ఈ చిత్రం రూపొందుతోంది. సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం నవంబర్ 22న డాక్టర్ దాసరి అందరూ కొత్తవాళ్లతో రూపొందించిన 'స్వర్గం-నరకం' సంచలన విజయం సాధించగా, అదే నవంబర్ 22న 'యంగ్ ఇండియా' షూటింగ్ ప్రారంభం కావడం విశేషం. 'స్వర్గం-నరకం' చిత్రం ద్వారా పరిచయమైన పద్మశ్రీ డాక్టర్ మోహన్బాబు 'యంగ్ ఇండియా' చిత్రం ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మరో ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, దాసరి పద్మ, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ వరప్రసాద్రెడ్డి, మంచు లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మాట్లాడుతూ, 'మన దేశంలోని యువశక్తిని విదేశాలు కొల్లగొడుతున్నాయి. మన యువత కేవలం ఉద్యోగాల కోసం తపన పడటం కోసమే కాకుండా దేశ భవిష్యత్తుకి దిక్సూచిలు కావాలని చెప్పే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. అందరూ కొత్తవారితో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటించడానికి 22 వేల మంది అప్లికేషన్లు పంపించారు. కొన్ని నెలల పాటు వాటిని పరిశీలించి, 540 మందిని ఇంటర్వ్యూ చేసి 81 మందిని ఎంపిక చేశాం. వీరికి నటనలో, డాన్స్లో శిక్షణ ఇచ్చాం. ఇంతమందిని ఒకేసారి పరిచయం చేయడం ఆనందాన్ని కలిగిస్తోంది. తెలుగు హీరోయిన్లు దొరకడం లేదని చెప్పేవారికి 'యంగ్ ఇండియా' సమాధానం చెబుతుంది. ఈచిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: సిహెచ్.రమణరాజు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బి.వెంకటేశ్వరరావు, ఫైట్స్: రాఖీ రాజేష్, రామ్లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి.జగదీష్చంద్రప్రసాద్, నిర్మాత: రామకృష్ణ ప్రసాద్, సమర్పణ: దాసరి పద్మ, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: డాక్టర్ దాసరి నారాయణరావు.


Click it and Unblock the Notifications











