హీరోయిన్ పూజా గాంధీ కి వ్యతిరేకంగా ధర్నా
బెంగళూరు : నటి పూజాగాంధీ తన నిశ్చితార్థం రద్దయిన తరువాత పురుషుల్ని, గౌడ సముదాయాన్ని హేయంగా అభివర్ణించటాన్ని ఖండిస్తూ రాష్ట్ర పురుషుల రక్షణ సమితి ఆనందరావు కూడలి గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. ఆందోళనలో మాజీ మంత్రి బి.టి.లలితానాయక్, సమితి ప్రతినిధులు బి.ఎన్.గౌడ, ఎన్.నాగేష్ పాల్గొన్నారు. ఆనందగౌడను నేరగాని స్థానంలో నిలిపేందుకు నటి పూజాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని లలితానాయక్ ఆరోపించారు.
పురుషులకు ఒక న్యాయం, మహిళలకు ఒక న్యాయం అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఆనందగౌడ పడిన వేదన, అనుభవించిన ఒత్తిళ్లకు తాము మద్దతుగా నిల్చామని చెప్పారు. పూజాగాంధీ తన ప్రవర్తన మార్చుకోక పోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సమితి ప్రతినిధులు రాణి నాగరాజ్, కుమారి, ప్రసాద్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
కన్నడ నటి పూజా గాంధీ వివాహం రద్దయింది. ఫైనాన్షియర్, బాలీవుడ్ చిత్ర నిర్మాత ఆనంద గౌడతో గత నెల 15న ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం పూజా గాంధీ ఇంటికి ఆనంద గౌడ వెళ్లినప్పుడు పూజా తల్లితో వాగ్వాదం జరిగింది. తదనంతరం వివాహాన్ని రద్దు చేసుకోవాలని పూజా గాంధీ నిర్ణయించింది. దీనిని ఆనంద గౌడ కూడా ధ్రువీకరించారు.
అలాగే ఆనంద్గౌడను తన తల్లి చులకనగా మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణల్ని పూజా గాంధీ తోసిపుచ్చారు. 'మా అమ్మను తూలనాడిన వ్యక్తిని వివాహం చేసుకునే ప్రసక్తేలేదు. నిశ్చితార్థం రోజున ఆనంద్గౌడ తొడిగిన ఉంగరాన్ని బుధవారం ఉదయం వెనక్కు పంపాను. నిశ్చితార్థం రద్దు కావడానికి ఆనంద్గౌడే కారణం. ఎవరు ఫోన్ చేసినా అనుమానంతో చూసేవాడు. అలాంటి వ్యక్తితో నూరేళ్ల జీవితం ఎలా గడిపేది. అందుకే వద్దనుకున్నాను అని తేల్చి చెప్పారు.
పూజా గాంధీ తల్లి తనను దూషించిందని ఆనంద గౌడ ఆరోపించారు. పూజా గాంధీ మంచిదేనని, తల్లి చాటు బిడ్డగా వ్యవహరిస్తున్నందున ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications












