ఓ వైపు పూజిస్తాం, మరోవైపు హింసిస్తాం.. మానవత్వం ఎక్కడుంది?.. దారుణ ఘటనపై సెలెబ్రిటీలు ఫైర్
మానవత్వం రోజురోజుకు మంటగలిసి పోతోంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. అని ఓ కవి రాసినట్టు.. హింసకు పరాకాష్టకు నిలిచే ఓ ఘటను కేరళలో చోటుచేసుకుంది. ఆకలికి అలమటించే ఓ ఏనుగు.. పైగా అది గర్భం దాల్చి ఉంది.. అలాంటి దానిపైనా కనికరం చూపకుండా దాని ప్రాణాలను తీశారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై సినీ సెలెబ్రిటీలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టపాసులతో పేల్చేశారు..
గర్భం దాల్చిన ఏనుగు ఆహారం కోసం గ్రామంలోకి వచ్చింది. అయితే కొందరు ఆకతాయిలు టపాసులు అమర్చిన పైనాపిల్ను దానికి ఇచ్చారు. తింటూ ఉండగానే అది పేలిపోవడంతో నోటికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు తట్టుకోలేక దగ్గర్లోని నదిలోకి వెళ్లింది. అలా అక్కడే ఆ ఏనుగు కూడా మృతి చెందింది. లోకాన్ని చూడని ఆ చిట్టి ఏనుగు గర్భంలోనే అంతమైంది.

అనసూయ ఆగ్రహం..
ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై అనసూయ స్పందిస్తూ.. ‘ఖచ్చితంగా మనం అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాము. మానవజాతి ఒక చెత్త రకం. మన జీవితం మొత్తం తప్పుగానే ఉన్నాం. అడవి దైవంతో సమానం. నాగరికత అనేది ఒక దెయ్యం. నిజంగా ఈ ఘటన చాలా వేదనను కలిగిస్తోంది. ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులను ఎలా చేయగలర'ని పేర్కొంది.

పూజిస్తాం, హింసిస్తాం..
ఏనుగు మృతి చెందిన ఘటనపై స్పందిస్తూ.. ‘మనమంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం.. కానీ ఏనుగులను ఇలా హింసించి చంపుతాం. ఆంజనేయుడిని పూజిస్తాం.. కానీ కోతులను గొలుసులతో కట్టి ఇష్టమొచ్చినట్టుగా ఆడిస్తాం. దేవతలను పూజిస్తాం.. కానీ మహిళలను తిడతాం, చంపుతాం, హింసిస్తామ'ని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకంటే బాగా ఎవ్వరూ చెప్పలేరు..
పూజా భట్ వ్యక్తపరిచిన కామెంట్లను ఉద్దేశించి రకుల్ ప్రీత్ కామెంట్ చేసింది. ఈ ఘటనను ఇంతకంటే బాగా ఎవ్వరూ కూడా చెప్పలేరని తెలిపింది. ప్రణీత స్పందిస్తూ.. మానవత్వం ఎక్కడ ఉందని ఆవేదన చెందింది.
Recommended Video

ఎంతటి క్రూరమైన చర్య..
మంచు మనోజ్ స్పందిస్తూ.. ‘ఎంతటి క్రూరత్వపు చర్య, ఎందుకు మానవత్వమనది రోజురోజుకూ నీచస్థితికి జారుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారికి కూడా ఇలాంటి శిక్ష లేదా ఇంతకంటై క్రూరమైన శిక్ష విధించాలి' అని కోరుకున్నాడు.


Click it and Unblock the Notifications











