Editor Gautham Raju: టాలీవుడ్లో మరో విషాదం.. దిగ్గజ ఎడిటర్ కన్నుమూత
కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీల్లో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు మరణించారు. అలాగే, ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు రకరకాల కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సంబంధం ఉన్న చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు మరణించారు. ఇలాంటి సంఘటనలతో సినీ పరిశ్రమల్లో గతంలో ఎన్నడూ లేనంత ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా దిగ్గజ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు.
దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ఎడిటర్గా సేవలు అందిస్తోన్న గౌతంరాజు (68) బుధవారం తెల్లవారుజామున మరణించారు. కొంత కాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న ఆయన.. ఈ మధ్య తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించినట్లు తెలిసింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులు గౌతంరాజును దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని సమాచారం. అక్కడి వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. దీంతో గౌతంరాజు బుధవారం ఉదయం తుదిశ్వాసను విడిచారట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా మీడియాకు వెల్లడించారు.

1954, జనవరి 15న గౌతంరాజు తమిళనాడులో జన్మించారు. చదువు పూర్తైన వెంటనే ఆయన సినిమాల మీద ఉన్న ఆసక్తితో చాలా మంది దర్శకుల దగ్గర అసిస్టెంట్గా పని చేశారు. ఈ క్రమంలోనే ఎడిటర్గా మారారు. అప్పటి నుంచి దక్షిణాదిలోని పలు భాషలకు ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో దిగ్గజ ఎడిటర్గా ఎదిగిపోయారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలకు పని చేయడం లేదు. గత ఏడాది 'మోసగాళ్లు' అనే సినిమానే ఆయనకు చివరిది. ఇక, గౌతంరాజు మరణ వార్తతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఎడిటర్ గౌతంరాజు కెరీర్ 1983లో వచ్చిన ఆనంద భైరవి అనే చిత్రంతో ప్రారంభం అయింది. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలకు పని చేశారు. అందులో మణిరత్నం దళపతి (1991), బ్రహ్మ (1992), సూర్యవంశం (1999), ఆది (2002), ఠాగూర్ (2003), బన్నీ (2005), డాన్ శీను (2010), గబ్బర్ సింగ్ (2012), వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013), గోపాల గోపాల (2015), ఒక్క అమ్మాయి తప్పా (2016), ఓం నమో వేంకటేశాయ (2017), కాటమరాయుడు (2017) అనే సినిమాలు గుర్తింపును తీసుకు వచ్చాయి. చివరి సారిగా ఆయన 2021లో విడుదలైన 'మోసగాళ్లు' అనే సినిమాకు పని చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ - వీవీ వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'ఆది' చిత్రానికి గానూ గౌతంరాజు ఉత్తమ ఎడిటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. ఆ తర్వాత కూడా పలు చిత్రాలకు ఉత్తమ ఎడిటర్గా నిలిచారు. ఇదిలా ఉండగా.. గౌతంరాజు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











