మళ్లీ ‘మా’ గొడవ: రాజేంద్ర ప్రసాద్ మిస్సింగ్? ఏం జరిగింది?
‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పటి నుండి మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కనిపించడం లేదని, మిస్సింగ్ అంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ పదవీ కాలం ముగియడంతో... కొత్త అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అసోసియేషన్ ఇతర కార్యవర్గం కూడా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైంది. 2019 వరకు వీరి సారథ్యంలోనే అసోసియేషన్ కార్యకలాపాలు జరుగనున్నాయి.
అయితే కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పటి నుండి మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కనిపించడం లేదని, మిస్సింగ్ అంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా ఎన్నిక సమయంలో కూడా రాజేంద్రప్రసాద్ హాజరు కాలేదని తెలుస్తోంది.

రాజేంద్ర ప్రసాద్ కు ఇష్టం లేదా?
శివాజీ రాజా మా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం రాజేంద్రప్రసాద్ కు అసలు ఇష్టం లేదని, అందుకే ఆయన వీరికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మా అధ్యక్షుడిగా రెండోసారి కూడా ఎన్నికవ్వాలని రాజేంద్రప్రసాద్ ప్రయత్నించారని సమాచారం.

ఫలించని ప్రయత్నం
మా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికవ్వాలని రాజేంద్రప్రసాద్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, దీంతో రాజేంద్రప్రసాద్ హర్ట్ అయ్యాడని, పదవి పోయిందనే కోపంతోనే ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.

శివాజీ రాజా పాలిటిక్స్?
మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు శివాజీ రాజా తెర వెనక రాజకీయాలు చేసాడని, ఆ కోపంతోనే కొత్తగా ఎన్నికైన శివాజీ రాజాను కనీసం అభినందించేందుకు కూడా రాజేంద్రప్రసాద్ ఇష్ట పడటం లేదని టాక్.

గతంలో
2015లో రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే సమయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో రాజేంద్రప్రసాద్ కు పోటీగా జయసుధ పోటీలో ఉండగా ఆరోపనలు, ప్రత్యారోపణలు, కోర్టు కేసులు ఇలా చాలా జరిగాయి.


Click it and Unblock the Notifications











