తెలుగు నిర్మాతపై హన్సిక కంప్లైంట్
హైదరాబాద్: తమిళనాడులో స్టార్ హీరోయిన్గా దూసుకెలుతున్న హన్సిక తెలుగు నిర్మాతపై కంప్లైంట్ చేసింది. తను నటించిన తెలుగు సినిమా 'సీతా రాముల కళ్యాణం లంకలో' చిత్రాన్ని తన అనుమతి లేకుండా తమిళంలోకి 'రౌడీ కొట్టై' పేరుతో అనువదించడం హన్సికకు నచ్చలేదు.
సూర్యతో కలిసి నటించిన 'సింగం-2', సిద్ధార్థకు జంటగా సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కిన 'తీయ వేలై సేయనుమ్ కుమరు'(తెలుగులో సంథింగ్ సంథింగ్) చిత్రాలు విజయవంతం అయిన తర్వాత ఆమెకు తమిళంలో అవకాశాలు పెరిగాయి. శింబుతో వెట్టై మన్నన్, వల్లు, శివ కార్తియేయన్తో మాన్ కరాటె, కార్తితో బిర్యానీ చిత్రాల్లో చేస్తోంది.
నిర్మాత తన సక్సెస్ రేటును క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకే తెలుగులో ప్లాప్ అయిన 'సీతా రాముల కళ్యాణం లంకలో ' చిత్రాన్ని తమిళంలో రౌడీ కొట్టై పేరుతో అనువాదం చేస్తున్నారని హన్సిక ఆరోపిస్తోంది. ఈ విషయమై 'సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్'లో నిర్మాతపై ఫిర్యాదు చేసింది.
'సీతా రాముల కళ్యాణం లంకలో' చిత్రానికి ఈశ్వర్ దర్శకత్వం వహించారు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా 2010 జనవరిలో విడుదలైంది. ఈ చిత్రం హిందీలో 'దుష్మనోంకా దుష్మన్' పేరుతో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో విడుదలైతే తన స్టార్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని హన్సిక్ భయపడుతోంది.


Click it and Unblock the Notifications












