మోదీ... 'సెల్ఫీ విత్ డాటర్' పై హీరోయిన్ ఘాటు విమర్శ
ముంబై : భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, భ్రూణ హత్యలు మొదలైన వాటిని అరికట్టడానికి ఎన్నో చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్యల్యో భాగంగా ఆయన సెల్ఫీ విత్ డాటర్ అనే ప్రచార కార్యక్రమం మొదలెట్టారు. దాంతో అనేకమంది ప్రముఖులు తమ ఆడపిల్లలుతో సెల్ఫీలు దిగి వాటిని ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేస్తూ వారు వంతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ రిచా ఛద్దా మాత్రం ఈ విషయమై మండిపడుతోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ...ఈ సెల్ఫీ విత్ డాటర్ కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈ క్యాంపెయిన్ ను ఓ వినుత్నమైన ఆలోచన అని అంగీకరించిన ఆమె, కాకపోతే సెల్ఫీలతో మహిళలు సమస్యలు మాత్రం తీరవంటూ తన అభిప్రాయాన్ని తెలియచేసారు. మహిళలకు వరకట్నం, వేధింపులు, వంటి తీవ్ర సమస్యలు ఎన్నో ఉన్నాయని, ఇవన్నీ సెల్ఫీలతో తీరుతాయని మాత్రం తాను అనుకోవటం లేదని ఆమె అన్నారు.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రతిఫలంగా బాలబాలికల నిష్పత్తి తేడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేడియోలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా బాలికల సంరక్షణపై ఆవశ్యకతను తెలియజేశారు. అమ్మాయిలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులకు ప్రోత్సాహం కల్పిస్తూ స్వీయచిత్రాల పోటీకి మద్దతు ఇచ్చారు.

ఉద్యమంలా బాలికల సంరక్షణ
బాలికలను సంరక్షించుకోవడంపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయాలన్నారు. తండ్రులంతా వారి కుమార్తెలతో దిగిన స్వీయ చిత్రాలను తగిన వ్యాఖ్యతో ట్విట్టర్ ద్వారా తనకు పంపిస్తే వాటిలో స్ఫూర్తిదాయకంగా ఉన్న వాటిని రీట్వీట్ చేస్తానని ప్రధాని తెలిపారు.బాలికల రక్షణ, ఆడపిల్లల ప్రాధాన్యత తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడనుంది.
సెల్ఫీ విత్ డాటర్ కి శ్రీకారం ఎక్కడంటే..
హరియాణాలోని బీబీపూర్ సర్పంచి సునీల్ జగ్లాన్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరియాణాలో పెరిగిపోతున్న లింగ వివక్షతపై పోరాటం చేయాలనే ఉద్దేశంతో.. కుమార్తెతో స్వీయ చిత్రం పోటీని ప్రారంభించారు. ఈ పోటీలో తండ్రులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని మోదీ ప్రశంసించారు. బాలికలను కాపాడడానికి ఆయన ప్రారంభించిన కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు.
సెల్ఫీ విత్ డాటర్కు విశేష స్పందన..
మోదీ పిలుపునివ్వడంతో కుమార్తెతో స్వీయ చిత్రం పోటీకి విపరీతంగా స్పందన వచ్చింది. ప్రముఖులు సహా చాలా మంది తమ కుమార్తెలతో సెల్ఫీలు దిగి ప్రధాని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలున్న చిత్రాన్ని మోదీ రీట్వీట్ చేస్తున్నారు. బాలికల అభివృద్ధికి సహకరించే ఈ ట్రెండ్ ఇలా కొనసాగడం ఎంతో లాభదాయకం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తన కూతురుతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. అలాగే కిరణ్బేడీ తన తండ్రితో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీటితో పాటు మోదీ చాలా మంది ఫోటోలను రీట్వీట్ చేసి ప్రోత్సహిస్తున్నారు.
విదేశాల నుంచి మంచి స్పందన..
మోదీ ప్రారంభించిన స్వీయ చిత్రాల పోటీకి విదేశాల నుంచి కూడా ఫోటోలు పంపారు. బాలికల సంరక్షణ కోసం ప్రారంభించిన సెల్ఫీ విత్ డాటర్ కార్యక్రమం తమను ఎంతగానో ఆకర్షించిందని అమెరికా, ఆఫ్రికా,థాయ్లాండ్, స్వీడన్ల నుంచి అనేకమంది తండ్రులు తమ కూతుళ్లతో దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వాటిని మోదీ రీట్వీట్ చేశారు. భారత్లో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు పలువురు విదేశీయులు మోదీని ప్రశంసించారు.
రిచా చద్దా కెరీర్ విషయానికి వస్తే...
కేవలం డబ్బుకోసమే సినిమాల్లో నటించే అవసరం తనకు లేదని ప్రముఖ బాలీవుడ్ నటి రిచాచద్దా అన్నారు. ఇటీవల రిచా నటించిన ఓ సినిమా కు ప్రొడ్యూసర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందన్న వార్తలు వినిపించాయి. దీనిపై రిచా స్పందిస్తూ.. ప్రతి నటికి ఏదో ఓ సందర్భంలో చెక్ బౌన్స్ అయిన సందర్భాలు ఎదరవుతాయన్నారు. అంతమాత్రాన దానిపై చర్చ చేయడం సరికాదన్నారు.
కేవలం డబ్బు కోసమే సినిమాల్లో నటించేవారు చాలా మంది ఉన్నారని, అయితే తాను మాత్రం అందులో ఒకరు కాదని స్పష్టం చేశారు. 2012లో తాను హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టగా, ఈ మూడేళ్ల కాలంలో సినీపరిశ్రమలో తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నాదు. చిత్రపరిశ్రమకు తానెప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటానని చెప్పారు. రిచా నటించిన నూతన చ్రితం మసాన్ జులై 24న భారత ప్రేక్షకుల ముందుకు రానుంది.
'మసాన్' విషయానికి వస్తే..
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా 'మసాన్' కు అరుదైన గౌరవం దక్కింది. మసాన్ రెండు అత్యున్నత అవార్డులు గెల్చుకుంది. ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ ప్రైజ్, ప్రామిసింగ్ ఫ్యూచర్ ప్రైజ్ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ లేచి కరతాళధ్వనులతో అభినందించారు.
నీరజ్ ఘావన్ దర్శకత్వంలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా నీరజ్ తన తొలి చిత్రంతోనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఈ సినిమాలో రిచా చద్దా, సంజయ్ మిశ్రా, విక్కీ కౌశల్, శ్వేతా త్రిపాఠి నటించారు. నీరజ్, రిచా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేన్స్ లో అవార్డులు గెల్చుకున్న మసాన్ చిత్ర బృందాన్ని బాలీవుడ్ ప్రముఖులు అభినందించారు.


Click it and Unblock the Notifications











