అలా అయితే పాటడం వదిలేస్తా: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
హైదరాబాద్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే తెలియని భారతీయ సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో గాయకుడిగా ఆరంగేట్రం చేసిన బాలు.. శంకరాభరణం - ఏక్ దూజే కే లియే .. సినిమాలతో టాప్ రేంజ్ గాయకుడిగా ఎదిగారు.
69 సంవత్సరాల వయసున్న బాలసుబ్రహ్మణ్యం అతిచిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించారు. ఇటీవలే ఆయన గాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 15 భాషల్లో 40వేలు పైగా పాటలు పాడిన ఆయన సినిమాల్లో నటుడిగాను, డబ్బింగ్ కళాకారుడిగానూ తన సత్తా చాటారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు. ఎప్పుడైతే నేను సరిగా పాడలేక పోయాను.... పాటకి న్యాయం చేయలేకపోయాను అని అనిపిస్తే ఇక పాడడం మానేస్తానని అన్నారు. రికార్డింగ్ కు అరగంట ముందే స్టూడియోకు చేరుకోవడం తనకుమ ముందు నుండీ అలవాటు అని, డైరెక్టర్ పెద్దవాళ్లా చిన్నవాడా అనేది అతడికి సంబంధం లేదు. పాటే లోకంగా పనిచేయడమే తనకు తెలుసన్నారు.
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండడం వల్ల తన కుటుంబం, పిల్లల విషయంలో సరిగా శ్రద్ధ పెట్టలేక పోయాను అని చెప్పుకొచ్చారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయనందుకు, శాస్త్రీయ సంగీతం నేర్చుకోనందుకు తాను ఇప్పటికీ బాధ పడుతున్నట్లు తెలిపారు. తన ఫేవరెట్ గాయకుడు ఎప్పటికీ మహ్మద్ రఫీయే అని తెలిపారు. పాడినంతకాలం తాను సంతోషంగా ఉంటానని, అంతకు మించి తనకు పెద్దగా కోరికలు ఏమీ లేవన్నారు.


Click it and Unblock the Notifications











