తొలగించిన సీన్లతో.. రాంబాబు, నష్టపోయా: దిల్ రాజు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై వివాదం చెలరేగడంతో తాను తీవ్రంగా నష్టపోయానని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోమవారం అన్నారు. సినిమాపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేయడంతో వారికి అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఈ సినిమా వివాదం అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి ఈ రోజు నుండి థియేటర్లకు పంపిస్తున్నట్లు చెప్పారు.
అభ్యంతరకర సన్నివేశాలు తొలగించినందున దయచేసి సినిమా ఆడేందుకు అందరూ సహకరించారని ఈ సందర్భంగా దిల్ రాజు తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ఇటు ఇండస్ట్రీకి, అటు తెలంగాణవారికి బాధ కలగకుండా ఉండే విధంగా తాను మధ్యవర్తిగా చర్యలు తీసుకున్నానని చెప్పారు. కట్ చేసిన సీన్లతో ఇవ్వాల్టి నుండి తెలంగాణలో ప్రదర్శింపబడుతుందని చెప్పారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని నిర్మాత దానయ్య చెప్పారు. సినిమాను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై తెలంగాణవాదులు ఇటీవల మండిపడ్డ విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా ఇందులో సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు సినిమా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. సినిమా ఆడకుంటా అడ్డుకున్నారు. దీంతో దర్శకుడు, నిర్మాత దిగి వచ్చి అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు ఒప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











