తారకరాముని పెళ్లి అదర్స్, లక్ష్మిప్రణతితో కళ్యాణ వైభోగం
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహం హైదరాబాదులోని హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన ప్రత్యేక సెట్టింగ్లు, విద్యుత్ వెలుగులు, ఆ వెలుగులతో పోటీగా తళుక్కుమన్న తారలు, నేతలు, మరెందరో అతిరథ మహారథులు, వేలాది మంది అభిమానుల ఆశీస్సుల మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటివాడయ్యాడు.
పెళ్లి వేడుకలు తిలకించేందుకు అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. పదిహేను భారీ డిజిటల్ స్క్రీన్లు అమర్చారు. వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికకు కుడి వైపున ప్రత్యేక మండపంలో నందమూరి తారక రామారావు, బసవ తారకం విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొలుత ఈ విగ్రహాలకు ఎన్టీఆర్ పూలమాలలు వేసి, వారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. గురువారం సాయంత్రమే వధూ వరులిద్దరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. తొలుత ప్రత్యేక లిఫ్ట్పై ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత వేదికపైకి వచ్చారు.
ప్రముఖులు ఒక్కొక్కరుగా వచ్చి వారిని ఆశీర్వదించారు. అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, బాబాయి నందమూరి బాలకృష్ణ, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, ఇతర నందమూరి వంశీయులు, బీజేపీ నేత వెంకయ్య నాయుడు, మంత్రి కె.జానారెడ్డి, చీఫ్ విప్ మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, అంజన్ కుమార్ యాద వ్, పీఆర్పీ అధినేత చిరంజీవి, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, నన్నపనేని రాజకుమారి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వధూ వరులను ఆశీర్వదించారు.


Click it and Unblock the Notifications











