కళాతపస్వికి ‘గామా ’ పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ను త్వరలో దుబాయ్ లో జరుగనున్న ‘గామా' అవార్డుల కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన సినిమా రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందించనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి బ్రహ్మానందం, అల్లరి నరేష్, శర్వానంద్, అలీ, ఇతర వెండితెర, బుల్లితెర నటులు, సింగర్స్ హాజరు కానున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కె. విశ్వనాథ్ గురించి...
కళాతపస్విగా సుపరిచితమైన కె.విశ్వనాథ్ పూర్తి పపేరు కాశీనాధుని విశ్వనాథ్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రుఅనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడినుంచి వారి నివాసం విజయవాడకి మారింది. హైస్కూలు విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.
చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన స్టార్ దర్శకుడయ్యారు.

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.
కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. శంకరాభరణం కు జాతీయ పురస్కారం తో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986 లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.
విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజా ను గానీ సంగీతదర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పని చేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











