కమల్ హాసన్ మరో వివాదాస్పద సినిమా, జైలు కెళ్లడానికి సిద్దం!
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ సినిమాలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. విశ్వరూపం సినిమా ఓ వర్గం వారిని కించ పరిచే విధంగా ఉందంటూ అప్పట్లో వివాదం రేగింది. ఆ కారణంగా సినిమా విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. త్వరలో విడుదల కాబోతున్న ‘ఉత్తమ విలన్' చిత్రం కూడా మరో వర్గం వారిని కించ పరిచే విధంగా ఉందనే వివాదం కూడా నడుస్తోంది.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాలను తన సినిమాల్లో నిర్మొహమాటంగా, నిర్భయంగా చర్చించే కమల్ హాసన్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల వీడకుండా ముందుకు వెలుతున్నాడు. త్వరలో ఆయన మరో వివాదాస్పద అంశంతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విషయంలో తాను జైలుకెళ్లే పరిస్థితి కూడా రావొచ్చు, అయినా నేను చేయాల్సింది చేస్తాను అంటూ తెగింపుగా ముందుకు సాగుతున్నాడు ఈ యూనివర్సల్ స్టార్.

భారతీయ సమాజంలో తరతరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థపై ఈ సినిమా ఉండబోతోంది. 1968లో తమిళనాడులోని కిళవెన్మణి అనే గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారం ఈ చిత్రం తెరక్కించబోతున్నారు. ఆ గ్రామానికి చెందిన 44 మంది దళితులను ఓ భూస్వామి పాశవికంగా హత్య చేయించిన సంఘటనతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి ‘ఉళ్లేన్ అయ్యా' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.
కుల వ్యవస్థ అనేది భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ రోగమని, అదంటే తనకు అసహ్యమని పేర్కొన్న కమల్ హాసన్....కిళవెన్మణి గ్రామంలో జరిగిన సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా చాలా బాధగా ఉంటుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, జైలుకెళ్లే పరిస్థితి వచ్చినా సినిమా తెరకెక్కించి తీరుతానని స్పష్టం చేసాడు. రాజకీయ నాయకులు కుల వ్యవస్థను తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటున్నారనే విషయాలను కూడా ఇందులో చూపించబోతున్నారు. సినిమా కథ పూర్తయింది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఒక మంచి కాన్సెప్టును ఎంచుకుని....కుల వ్యవస్థ నిర్మూలనకు దోహదం చేసేలా కమల్ హానన్ చేస్తున్న ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











