తతంగం చూసి కృష్ణంరాజు వద్దనుకుని వెళ్లిపోయారు
హైదరాబాద్ : వేడుకల్లో 40 మందికి సన్మానం చేయాలని ముందుగా అనుకుని, 60 మందిని వేదికపైకి పిలిచారు. ముందుగా సన్మానించిన రావి కొండలరావు, సత్యానంద్, గొల్లపూడి మారుతీరావు వంటి వారి నుంచి శాలువలు, మెమొంటోలు తీసేసుకుని వాటినే మళ్లీ వేరే వారికి ఇచ్చారు. పోనీలే తమకు బరువైనా తగ్గిందని వారంతా సంతృప్తిపడ్డారు. ఈ తతంగం చూసి కృష్ణంరాజు, డైరెక్టర్ సాంబశివరావు తదితరులు సన్మానం వద్దనుకుని వెళ్లిపోయారని సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి అన్నారు. గత నాలుగురోజులుగా చెన్నైలో జరుగుతున్న సినీ శతాబ్ది ఉత్సవంలో తెలుగు వేడుకలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
"సినీ శతాబ్ది వేడుకలు జరుపుకోవడానికి కారణమైన దాదా సాహెబ్ ఫాల్కే ప్రస్తావనే లేకుండాపోయింది. నిర్మాతల తరఫున నాకు సన్మానం ఉందని వేడుకల తొలిరోజు కాట్రగడ్డ ప్రసాద్ ఫోన్ చేసి చెప్పారు. మరునాడు 2 గంటలకు ఫోన్ చేస్తామన్నారు. కానీ ఆ తరువాత నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి అనుభవాలెంతోమందికి ఉన్నాయి. కార్యక్రమం నిర్వహణా తీరు చూసి.. 'ఇదేం ఫంక్షనంటూ' సీనియర్ నటుడు కృష్ణంరాజు సహా అందరూ బాధపడినవారే అంటూ బాధగా అన్నారు కాట్రగడ్డ మురారి.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 'ఫిల్మోత్సవ్' జరిగింది. తెలుగు వంటకాలు, తెలుగు సంస్క్కతీ సంప్రదాయాలు ఆ ఉత్సవాల్లో తమ ఘనతను చాటాయి. కానీ ఇప్పటి వేడుకల్లో సంస్కృతీ సంప్రదాయాల సంగతెలాగున్నా.. చాలామందికి సరైన ఆహ్వానాలే లేవు. చెన్నైలోనే ఉంటున్న ప్రముఖ రచయితలు వెన్నెలకంటి, భువనచంద్ర, అలనాటి గాయని ఏపీ కోమల వంటి వారికి కూడా ఆహ్వానాలు అందలేదు. గొల్లపూడి మారుతీరావు వంటి సీనియర్కు సన్మానం జరుగుతున్నట్లు వేదికపైకి పిలిచే వరకూ తెలియదు.సీనియర్ నిర్మాత రాఘవ వంటి వయసు మళ్లిన వ్యక్తిని గంటలపాటు కూర్చోబెట్టడం ఏం సమజసం? అని ప్రశ్నించారు.
ఇక అతిథులకు నాలుగు రోజుల కార్యక్రమాలకు ఒకే పాస్ ఇస్తే బావుండేది. కానీ ఏ రోజుకారోజు పాస్ల కోసం చాంబర్కు వెళ్లి దేబిరించడం అందరికీ అసహ్యంగా ఉంది. ఏరోజు పాస్ ఆ రోజే అందుతుండడంతో అందరూ ఇబ్బంది పడ్డారు. . ఇలాంటి పరిస్థితి చలనచిత్ర వేడుకల్లో ఎన్నడూ లేదు. రాజకీయ నేతల్ని ముందు వరుసలో కూర్చోబెట్టారు. సినిమా వారిని గ్యాలరీలకు తోసేశారు. సినిమా వేడుకల్లో సినిమా వారికే ప్రాధాన్యత లేకపోతే ఎలా? ఈ మనస్తాపంతో చాలామంది హైదరాబాద్ తిరిగివెళ్లిపోయారు.
పేకేటి శివరామ్ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి సేవల్ని కూడా గుర్తించలేకపోయారు. పాతతరం వారి విలువ తెలియని వారు ఫిలిం ఛాంబర్కి అధ్యక్షులా? ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడం 'మన' నిర్వాహకుల తప్పు. ఇందుకు కారణం ఎవరు? నాయకత్వ లోపమా, సరైన మార్గనిర్దేశం లేకనా? ఆదరణ లేకనా? ఈ తప్పంతా ఏమాత్రం అవగాహనా, అనుభవం లేని వ్యక్తి నిర్వహించడమేనా?. సినిమాలు తీసేవారెవ్వరైనా ఛాంబర్ అధ్యక్షుడు కావచ్చు. కానీ కొందరికే దాని నిర్వహణ వచ్చు. ఈ విషయంలో సౌతిండియన్ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నూటికి నూరుశాతం ఫెయిలైనట్లే అని చెప్పారు.
అయితే సీనియర్ నిర్మాతలైన కేఎస్ రామారావు, కాట్రగడ్డ ప్రసాద్, అశోక్బాబు, అట్లూరి సాయిప్రసాద్ తదితరులు ఎంతో కష్టపడ్డారు. అయితే వారి ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. చివరికి వారూ చేతులెత్తేశారు. వారు మాత్రం ఎంతని చేయగలరు?. సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన అక్కినేని జన్మదిన వేడుకలకు వెళ్తే.. అక్కడా నిరాశే. ఆయన కుటుంబసభ్యులు, హైదరాబాద్ వారే ఆయన్ని చుట్టుముట్టేశారు. ఒకనాటి నిర్మాతగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలని, ఆయనతో మాట్లాడాలని ఆ కార్యక్రమానికి వెళ్లా. కానీ నాలాంటి నిర్మాతలను దూరంగా పెట్టారు. దాంతో చెమర్చిన కళ్లతో వెనుదిరిగా అని మురారి వాపోయారు.


Click it and Unblock the Notifications












