కారణం అదే: ఎంఎస్ మృతిపై కేసీఆర్, బాబు, చిరు ప్రముఖులు
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం ఆయన గత కొంత కాలంగా మధు మేహంతో బాధ పడుతున్నారు. ఇదే క్రమంలో గుండు పోటు కూడా అటాక్ చేయడంతో గత ఐదు రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.
వయసు పైబడటంతో....షుగర్ లెవల్స్ పెరిగి పోవడం, గుండె సంబంధిత సమస్యలు ఒకసారి ఎదురు కావడంతో ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు తెలిపారు. గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించినా పరిస్థితి మెరుగు పడలేదు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
శుక్రవారం మధ్నాహ్నం 2 గంటల నుండి సాయంత్రం4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్లో ఎంఎస్ పార్థివదేహాన్ని ఉంచబోతున్నారు. వికారాబాద్ లోని ఎంఎస్ ఫామ్ మౌస్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎంఎస్ నారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్య మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమ మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసారు.
చిరంజీవి స్పందిస్తూ...ఎంఎస్ నారాయణ మరణం నన్ను ఎంతో బాధించింది. ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

మరో హాస్య నటుడు కొండ వలస లక్ష్మణ రావు మాట్లాడుతూ....క్రమశిక్షణ కారణంగానే ఆయన ఈ స్థాయికి ఎదిగారని, సెట్ లో తోటి నటులకు సలహాలు ఇచ్చే వారని తెలిపారు. మాటలు రావడం లేదంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు.
మంచు లక్ష్మి స్పందిస్తూ...అంకుల్ తనకు చిన్నప్పటి నుండి తెలుసు.తన తండ్రి మోహన్ బాబే ఆయన్ను నటన వైపు ప్రోత్సహించారని, ఆయనతో ఎన్నో సరదా జ్ఞాపకాలు ఉన్నాయని, ఆయన ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారని అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందిస్తూ...ఎంఎస్ నారాయణ హఠాన్మరణం తనను షాక్కు గురి చేసిందని పేర్కొన్నారు.
దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.... ఎంఎస్ లేని లోటు తీరనిది, ఆయన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











