ఎన్టీఆర్కు అలా దగ్గరయ్యాను, ఇద్దరం అడిక్ట్ అయిపోయాం: లక్ష్మీ పార్వతి
సాహిత్య పరమైన చర్చే ఎన్టీఆర్తో తనకు సాన్నిహిత్యాన్ని, ఒకరిపై ఒకరికి ఇష్టాన్ని పెంచిందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ చర్చకు మేము ఎంత అడిక్ట్ అయ్యామంటే... ఐదు నిమిషాలు కూడా దూరం అయితే భరించలేని స్థితి
మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీ రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి అంశం చాలా ఆసక్తికరం. భార్యగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ త్వరలో రామ్ గోపాల్ వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చూపించబోతున్నారు.
కాగా... అసలు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చింది? ఆవిడ ఆకర్షణలో ఆయన ఎలా పడ్డారు? అనేది చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాలు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్కు దగ్గరవ్వడానికి కారణం అదే
ఎన్టీఆర్ గారిని ఆకర్షించడానికి తానేమీ అందగత్తెను కాదని..... ఎన్టీఆర్ సాహితీ ప్రియుడు, తెలుగు భాష అంటే ఆయనకు ఎంతో ఇష్టం, నాకు కూడా వాటి గురించిన చర్చ అంటే చాలా ఇష్టం. ఇద్దరి ఇష్టాలు ఒకటి కావడం వల్లనే తమ మధ్య సాన్నిహిత్యం, ఆకర్షణ పెరిగింది అని లక్ష్మీ పార్వతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నా సహచర్యంలో ఎన్టీఆర్ రిలాక్స్ అయ్యేవారు
సాహిత్యం గురించిన చర్చలు తమ మధ్య తరచూ సాగుతుండం వల్ల క్రమేపీ మా మధ్య అనుబంధం బలపడింది. నా సహచర్యంలో ఎన్టీఆర్ రిలాక్స్ అయ్యేవారు. నరసరావుపేటలో నాడు నేను నివసించిన ఇంటికి ఎన్టీఆర్ ఫోన్ పెట్టించారు. ఆ ఫోన్ బిల్లు మూడు లక్షల రూపాయలను ఆయన కట్టారంటే, మా మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థమౌతుంది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్ ప్రపోజ్ చేశారు. ‘నువ్వు ఒంటరినంటున్నావు.. నేనూ ఒంటరినే. మన మధ్య ఆత్మీయత ఏర్పడింది కదా... మనమెందుకు పెళ్లి చేసుకోకూడదని మొదటిసారి ప్రపోజ్ చేశారు. రెండు రోజులు ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్ కి ఫోన్ చేసి నా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నాను అని చెప్పాను' అని లక్ష్మీ పార్వతి తెలిపారు.

అడిక్ట్ అయిపోయాం, ఆనందంగా గడిపేవారం
సాహిత్యమే మా ఇద్దరి మధ్య వారధి కట్టింది. పెళ్లయిన తర్వాత తెల్లవారు ఝామున 3 గంటలకు నిద్ర లేచేవారం. లేచిన తర్వాత రాజకీయాలు అస్సలు మాట్లాడేవారం కాదు.
ఎక్కువగా ఆధ్యాత్మిక అంశాలు, ప్రభందాలు, కావ్యాలు మాట్లాడుకునే వారం. ఈ చర్చకు మేము ఎంత అడిక్ట్ అయ్యామంటే... ఐదు నిమిషాలు కూడా దూరం అయితే భరించలేని స్థితి వచ్చింది. ఓ పక్క బయట రాజకీయాలు జరుగుతూ ఉండేవి. ఏ చిన్న సమయం దొరికినా మేమిద్దరం సాహిత్య ప్రపంచంలో ఎంతో ఆనందంగా గడిపేవారం... అని లక్ష్మీ పార్వతి తెలిపారు.

నా అంత పిచ్చిది ఈ ప్రపంచంలో లేదు
ఒరిజినల్గా నా అంత పిచ్చిది ఈ ప్రపచంలో లేదు. నాది చాలా చిన్న ప్రపంచం. చదువు తప్ప మరో లోకం లేదు. నేను చదివినన్ని పుస్తకాలు లేడీస్ లో ఎవరూ చదివి ఉండరు. ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు చదివాను. ఆత్మాత్మక గ్రంధాలు, కావ్యాలు చదివాను. తెలుగు సాహిత్యం నుండి రష్యా సాహిత్యం వరకు అన్నీ చదివాను అని లక్ష్మీ పార్వతి తెలిపారు.

ఎన్టీఆర్ ప్రకటించడంతో షాకయ్యాను
పెళ్లికి ముందు ఓసారి నేను ఫోన్ చేసి ‘మీ జీవిత చరిత్ర రాయడానికి అనుమతివ్వండి' అని అడిగితే, ‘నేనే చెబుతా' అని ఆయన అన్నారు. ఓసారి అకస్మాత్తుగా ఫోన్ చేసి ఏ విషయం చెప్పకుండా నాచారం స్డూడియోకి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి, ఎన్టీఆర్, మీడియా వాళ్లు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర ప్రముఖులందరూ ఉన్నారు. ‘లక్ష్మీపార్వతి గారూ, రండి. నా జీవిత చరిత్ర రాయబోతున్న రైటర్ వీరే' అంటూ ఆయన అక్కడి వారికి చెప్పగానే నేను షాకయ్యా.... అని లక్ష్మీ పార్వతి తెలిపారు.

అనేక కామెంట్స్ చేశారు
ఎన్టీఆర్ జీవిత చరిత్రను నేను రాయడంపై కూడా విమర్శలు వచ్చాయి. సి.నారాయణరెడ్డి లాంటి ఉద్దండులు ఉంటే ఓ అనామకురాలు, లెక్చరర్ అయిన లక్ష్మీపార్వతితో ఈ జీవిత చరిత్ర రాయించడమేంటని విమర్శించారు. ఉద్దండులను కాదని, నాతోనే తన జీవిత చరిత్రను ఎన్టీఆర్ ఎందుకు రాయిస్తున్నారో! అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు.


Click it and Unblock the Notifications











