ఎన్టీఆర్ వెన్నుపోటు పర్వంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: ఆర్జీవీ సంచలనం
ఎన్టీఆర్ బయోపిక్ మీద వర్మ మరో ప్రకటన చేశారు. ఈ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఆయన వెల్లడించారు.
Recommended Video

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఎన్టీఆర్' జీవితం మీద సినిమా తీయబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విషయంలో ఆయన మరో ప్రకటన చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా త్వరలోనే ప్రారంభిస్తానన్నారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రకటన బట్టి ఈ సినిమా లక్ష్మీ పార్వతి కోణంలో ఉంటుందని భావిస్తున్నారు. లక్ష్మీ పార్వతి చెప్పిన విషయాలను సేకరించిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తే ఈ సినిమా పెద్ద వివాదం అవ్వడం కాయం.

వెన్నుపోటు పర్వం చూపిస్తాను
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో అన్నీ నగ్న సత్యాలు, సంఘటనలు చూపిస్తానని... ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిందెవరు? ముందు నుండి కడుపులో గుద్దింది ఎవరు? అనే విషయాలు వెల్లడిస్తానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

ఎన్టీఆర్ చివరి రోజుల్లోని వాస్తవాలు
ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తానని, ఆయన జీవితం చివర్లో జరిగిన సంఘటనల వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఎవరు? ఇదంతా చేశారు అనే విషయాలు సినిమాలో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

తలెత్తుకునేలా చేసిన మూడు అక్షరాలు
తెలుగువాడిని మొట్ట మొదటి సారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు ప్రతి తెలుగు వాడి చాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహా నటుడే కాదు... మొత్తం తెలుగునేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు అని వర్మ గతంలో ఓ ప్రకటనలో తెలిపారు.

గర్వంగా ఫీలవుతున్నాను
నాకు ఆయనతో పర్సనల్గా ఉన్న అనుబంధం ఏమిటంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అడవిరాముడు' చూడటానికి 23 సార్లు బస్సు టికెట్కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లే వాడిని. అంతే కాకుండా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేలఈనినట్లు వచ్చిన లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇపుడు ఎన్టీఆర్ జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకెక్కించడం చాలా చాలా గర్వంగా ఫీలవుతున్నాను... అని వర్మ గతంలో ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.

శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా
అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ఇప్పటకే ప్రకటించారు.

పొగడరా నీతల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను
ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు గారంటే నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి తెలియజెప్పేది.... ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ను అంటూ వర్మ ఇప్పటికే ఓ పాట కూడా విడుదల చేశారు.

ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన
తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ఇప్పటికే ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆ పాత్రలో తానే చేస్తానని తెలిపిన ఆయన దర్శకుడు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే ఇంతలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుండి ఒక ప్రకటన రావడం నందమూరి అభిమానులను ఆందోళనలో పడేసింది.

లక్ష్మీ పార్వతి ఏమంటోంది?
రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సల్. ఆయనంటేనే ఓ వివాదం. ఎప్పుడో మరిచిపోయినటువంటి పాత పగలను గుర్తు చేయడం...అనేది ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాల మీద ప్రజల అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలన్నింటినీ కూడా స్పష్టంగా తీయగలడా? అని లక్ష్మీ పార్వతి సందేహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మీద సినిమా తీయాలని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, కానీ వాస్తవాలు తీయాలని, నిజాలను నిర్భయంగా చెప్పాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.

బాలకృష్ణతో తీస్తే న్యాయం జరుగదు అంటున్న లక్ష్మీ పార్వతి
వర్మ సినిమాలో బాలకృష్ణ హీరో అనే మాట వినపడుతోంది. అది ఎందుకొచ్చిందో నాకూ తెలియదు. బాలకృష్ణను పెడితే పిక్చర్ కు న్యాయం జరుగదు. ఆయన తీయాలనుకున్న వివాదాస్పద అంశాల్లో బాలకృష్ణ కూడా ఒకరు... అని లక్ష్మి పార్వతి గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు
ఆ రోజు వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి సపోర్టు చేశారు. మరి బాలకృష్ణ వర్మ సినిమాలో ఉంటే నిజాన్ని నిర్భయంగా వర్మ చూపించగలరా? అని లక్ష్మి పార్వతి ప్రశ్నించారు.

చెప్పులేసిన సంఘటన కూడా చూపాలి
వివాదమైన సంఘటనలు ఉంటాయని వర్మ చెబుతున్నారు కనుక.... వైస్రాయ్ హోటల్ లో ఆయనపై చెప్పులేసిన సంఘటన, అల్లుడు తనకు చేసిన అన్యాయం మీద మాట్లాడిన మాటలు, జెమినీ టీవీలో ఆయన ఇచ్చిన ధర్మపీఠం ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ప్రత్యేక సాక్ష్యాలే. ఇవన్నీ చూపాలి.... అని లక్ష్మీ పార్వతి అంటున్నారు.

అవి చూపిస్తే చంద్రబాబు, బాలయ్య ఊరుకుంటారా?
ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలన్నింటినీ కూడా వర్మ చెప్పగలరా? అలా చెబితే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? అసలు ముందు బాలకృష్ణ ఊరుకుంటారా? ఇన్నీ కాకుండా వాళ్లకు అనుకూలంగా చెబితే నేను ఊరుకుంటానా? అని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించారు.

ఆయన చెప్పిందే పుస్తకంలో రాశాను
ఎన్టీఆర్కు కుటుంబ సభ్యుల నుండి చీత్కారాలు ఎదురయ్యాయని నేనెప్పుడూ అనలేదు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన నన్ను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని నేను రాసిన పుస్తకంలో రాశాను. ఆ మాట కూడా నాది కాదు... స్వయంగా ఎన్టీఆర్ గారు ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం చెప్పారు. నన్ను చూసుకోవడానికి వివాహం అవసరం అయింది. అందుకే నేను ద్వితీయ వివాహం చేసుకున్నాను. నా చేయి, కాలు సరిగా పని చేయదు. నేను అన్నం తినలేను అని స్వయంగా ఆయన చెప్పిన మాటలే ఆ పుస్తకంలో రాశాను... అని లక్ష్మి పార్వతి గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

బాలయ్యను పెడితే న్యాయం జరుగదు
నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపి సింగ్ లాంటి వారిని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత ఎన్టీఆర్ లాంటి మహానుభావుడికే దక్కింది. కాబట్టి చరిత్రను గొప్పగా చూపిస్తే అది వేరు. కానీ చివర్లో ఆయన పదవి లాగేసినటువంటి వైనాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించగలిగే ధైర్యం అయితే రామ్ గోపాల్ వర్మకు ఉందో లేదో తెలియదు కానీ.... బాలకృష్ణ పేరు బయటకు వస్తోంది కాబట్టి ఆయన్ను హీరోగా పెడితే ఈ సినిమాకు న్యాయం జరుగదు అని నేను అనుకుంటున్నాను... అని లక్ష్మి పార్వతి గతంలో అన్నారు.

వివాదాల జోలికి వద్దని బాలయ్యకు చెప్పాను
బాలకృష్ణ సినిమా తీస్తానని ప్రకటించినపుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను. మీ నాన్న గారు సాధించిన గొప్పతనం, విజయాలు అందరికీ కూడా ఆదర్శవంతం అవుతాయని చెప్పాను. నువ్వు వివాదాల జోలికి వెళ్లావంటే నీ బావకు నీవు సపోర్టు చేయాల్సి వస్తుంది. నీ బావను సపోర్టు చేస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగదు. ఎందుకంటే మీ నాన్న చెప్పిన మాటలు పూర్వ పక్షం చేసినట్లు అవుతుంది. కనుక ఇది కరెక్ట్ కాదు...అటువంటి వివాదాల జోలికి పోకుండా నువ్వు తీసుకో సినిమా అని చెప్పాను అని లక్ష్మి పార్వతి అన్నారు.


Click it and Unblock the Notifications











