కోర్టు మెట్లెక్కిన టాలీవుడ్ నిర్మాత: నా స్థలం కాజేస్తున్నారంటూ...
ఎప్పుడూ వివాదాల్లో ఉండే టాలీవుడ్ నిర్మాత సి. కల్యాణ్ మళ్ళీ కోర్టుమెట్లెక్కారు 389 గజాల కామన్ ప్రాపర్టీని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ ఈ సినీ నిర్మాత కోర్టును ఆశ్రయించారు.
ఎప్పుడూ వివాదాల్లో ఉండే టాలీవుడ్ నిర్మాత మళ్ళీ కోర్టుమెట్లెక్కారు. అయితే ఈ సారి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే. జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లో ఉన్న ప్లాట్ నం. 31/బిలో డాక్టర్ టి. శ్రీనివాసులు, టి.విమలాదేవిలకు చెందిన 1182 గజాల స్థలాన్ని జ్యోతి కన్స్ట్రక్షన్స్కు 1998లో డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చారు.
అయితే జీహెచ్ఎంసీ అనుమతితో 11 ప్లాట్లు నిర్మించి విమల్ బిల్డింగ్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కు చెందిన 11 మందికి విక్రయించారు. అనంతరం ఆ కాంట్రాక్టర్ నిర్మాణానంతరం మిగిలిపోయిన 389 గజాల కామన్ ప్రాపర్టీని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ ప్రముఖ సినీ నిర్మాత సి. కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం. 66 కు చెందిన డాక్టర్ టి.శ్రీనివాసులు, విమలాదేవిలకు జూబ్లీహిల్స్ రోడ్నెం. 5లో 1188 గజాల స్థలం ఉండగా ఈ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 17కు చెందిన జ్యోతి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎం.వీ.ఎస్ శేషగిరిరావుకు అప్పగించారు. 11 ప్లాట్లు విక్రయించగా 2015లో రోడ్డు విస్తరణలో అపార్ట్మెంట్కు చెందిన 202 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ సేకరించింది.
జీహెచ్ఎంసీ అనుమతుల్లో చూపిన విధంగా స్థలాన్ని పూర్తిగా ఫ్లాట్ ఓనర్స్ కే పంచాల్సి ఉంది. అయితే, స్థల యజమానులు శ్రీనివాసులు, విమలాదేవిలతో పాటు జ్యోతి కన్ స్ట్రక్షన్స్ అధినేత ఎంవీఎస్ శేషగిరిరావులు మిగిలిన స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ కల్యాణ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు పై ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











