డబుల్ బొనాంజ: బాలయ్య గెలుపుతో ఫ్యాన్స్ సంబరాలు!
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ అభిమాలు ఈ రోజు డబుల్ బొనాంజ అందుకున్నారు. ఓ వైపు బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రం నేటితో రాష్ట్ర వ్యాప్తంగా 127 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఆనందం ఓ వైపు....మరో వైపు బాలయ్య హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుతూ, బాణా సంచా పేలుస్తూ ఉత్సాహంగా సందడి చేసారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న బాలయ్య తొలిసారిగా ఈ సారి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ సినిమాలకు కూడా సమయం కేటాయిస్తానని బాలయ్య చెప్పడంతో బాలయ్య అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

బాలయ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వేళ....'లెజెండ్' చిత్రం ఆయనకు బాగా ప్లస్సయిందని చెప్పొచ్చు. వాస్తవానికి 'లెజెండ్' సినిమా తెరకెక్కుతున్న సమయంలోనే ఈ చిత్రం బాలయ్య రాజకీయ తెరంగ్రేటానికి ప్లస్సయ్యేలా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరిగింది. సినిమా విడుదల చేయడం కూడా సరిగ్గా ఎన్నికల వేడి ప్రారంభం కావడానికి ముందు విడుదల చేసారు.
బాలయ్యకు రాజకీయంగా బలం చేకూర్చే విధంగా 'లెజెండ్' చిత్రం ఉందంటూ పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలుపిన విషయం తెలిసిందే. ఏది ఏమైతేనేం...బాలయ్య విజయం సాధించడం అభిమానులను, టీడీపీ శ్రేణులను ఆనందానికి గురి చేసింది. 'లెజెండ్' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.


Click it and Unblock the Notifications











