సీనియర్ నటి గీతాంజలి మృతితో పెద్ద దిక్కు కోల్పోయాం.. మా సభ్యులు నరేష్, జీవిత
ప్రముఖ నటి గీతాంజలి ఇక లేరన్న వార్త సినీ, ప్రేక్షక వర్గాల్లో విషాదం నింపింది. గురువారం తెల్లవారు జామున ఆమె గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని తన నివాసం వద్ద నుంచి ఫిలిం నగర్కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అభిమానులు, సన్నిహితులు, స్నేహితుల సందర్శన కోసం ఫిలింఛాంబర్లో ఉంచుతామని మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ తెలిపారు. ఆ తర్వాత 5 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.
సీనియర్ నటి గీతాంజలి మరణంపై మా అధ్యక్షుడు వీకే నరేష్ స్పందించారు. సినిమా పరిశ్రమ గీతాంజలి లాంటి ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. నా తల్లి విజయనిర్మలతోనూ ఆవిడకు మంచి అనుబంధం ఉంది. ఇక నటిగా ఆవిడ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది భాషల్లోనే కాదు.. హిందీలోనూ నటించారు.

నటిగానే కాదు.. వ్యక్తిగతంగానూ గీతాంజలిగారు ఎప్పుడూ సంతోషంగా, అందరితో కలివిడిగా ఉండేవారు. అలాంటి వ్యక్తి అనూహ్యంగా ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోతారని అనుకోలేదు. ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరికీ ఆమె ఎంతో చేరువగా ఉండేవారు. మంచి, చెడుల్లో భాగమైయ్యేవారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టిపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్రను వేశారు గీతాంజలి. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు ఎంతోకాలం గా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు తీరని లోటు అని అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు తెలిపారు. శ్రీమతి గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











