ఆ మాట చెప్పినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: మహేష్ బాబు
హైదరాబాద్: ‘నాన్న గారు ‘శ్రీమంతుడు' సినిమా చూసిన తర్వాత నీ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ చేసావు అని ప్రశంసించారు. ఆయన ఇచ్చిన ఉత్తమ ప్రశంస ఇది. నాన్న ఆ మాట చెప్పినపుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన నిజాయితీగా ఆ మాట చెప్పారు. అన్నయ్య రమేష్ కూడా తొలిసారి నాకు ఓ ఫ్లవర్బొకే ఇచ్చారు. మా కుటుంబ సభ్యులందరికి సినిమా చాలా బాగా నచ్చింది' అన్నారు మహేష్ బాబు.
‘శ్రీమంతుడు' సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ‘శ్రీమంతుడు' నా జీవితంలో మరిచిపోలేని చిత్రమన్నారు. ఈ చిత్రం విజయం కేవలం ఆనందాన్ని ఇచ్చింది అనడం చిన్నమాటే అవుతుందన్నారు.

ఈ చిత్ర విడుదలకు ముందు టెన్షన్తో వారం రోజులు నిద్రపోలేదు. విడుదలైన తర్వాత హిట్ లభించిన ఆనందంతో నిద్రరావడం లేదు. మళ్లీ ఇప్పటి నుంచే తదుపరి సినిమాల గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనుకావడం నాకు ఇష్టం లేదు. నెక్ట్స్ మూవీ బ్రహ్మోత్సవం షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో నటించడానికి సిద్ధమేనా అనే ప్రశ్నకు స్పందిస్తూ... కథ ఓకే అయితే ఆయనతో కలిసి నటిస్తానన్నారు.
బాహుబలితో మీ సినిమా వసూళ్ల పరంగా పోటీ పడుతుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ..మంచి సినిమా చేసినప్పుడు డబ్బుల గురించి మాట్లాడటం గౌరవం కాదని అనుకుంటున్నాను. డబ్బులు వస్తాయి, పోతాయి...వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు మహేష్ బాబు.
శ్రీమంతుడు చిత్రీకరణ సమయంలో బుర్రిపాలెంను దత్తత తీసుకోమని బావ జయదేవ్ సలహా ఇచ్చారు. నాకు మంచి ఆలోచనగా అనిపించింది అయితే సినిమా విడుదలైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్ని మొదలుపెడితే ప్రచారం కోసం చేస్తున్నానని అనుకుంటారనే ఆలోచనతో కొన్నాళ్ల పాటు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. మరో మూడు, నాలుగు నెలల్లో దానిపై ఓ కార్యచరణ రూపొందిస్తామన్నారు.


Click it and Unblock the Notifications











