మళ్లీ మహేష్ బాబు-రామ్ చరణ్ బాక్సాఫీసు ఫైట్?
హైదరాబాద్: బాక్సాఫీసు వద్ద ఇద్దరు స్టార్ హీరోల సినిమాల విడుదల అవుతున్నాయంటే పరిస్థితి ఎంత ఆసక్తికరంగా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఉండే సందడే వేరు. గతంలో వీరు పలు సందర్భాల్లో బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు.
తాజాగా మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీసు వద్ద డీ అంటే ఢీ అనబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ నిర్మిస్తోంది. తమన్నా హీరోయిన్.

మరో వైపు రామ్ చరణ్-కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం కూడా సెప్టెంబర్ 26నే విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్.
దసరా సీజన్ కావడం, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్దం అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి వస్తుండటంతో దసరా హాలిడేస్ జాలీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











