'దేనికైనా రెడీ' వివాదంపై మంచు మనోజ్
హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీ' దసరా పండుగ రోజు విడుదలైంది. హన్సిక హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం బ్రాహ్మణ కుల ఆగ్రహానికి గురైంది. వారు ఈ చిత్రంలో బ్రాహ్మణ వ్యతిరేక సన్నివేసాలు తొలిగించాలంటూ డిమాండ్ చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ తన ట్వీట్ లో సమాధాన మిచ్చారు. ఆయన ట్వీట్ లో తమ సినిమాలో అటువంటివేమీ లేవని, అన్ని మతాలూ సమానమనే విషయాన్నే చెప్పామని అన్నారు.
ఆ ట్వీట్ ఏమిటంటే..." దేనికైనా రెడీ చిత్రంలో ఎక్కడా బ్రాహ్మణులు నాన్ వెజ్ తినే సన్నివేశం లేదు. కొందరు సినిమా చూడకుండా మతపరమైన వివాదం చేస్తున్నారు. సినిమా చివర్లో హిందూ,ముస్లిం,క్రిష్టియన్ అందరూ మనుష్యులే... ప్రేమ విషయంలో అందరూ సమానమే అని చెప్పాం. సినిమాలో మంచిని చూడండి... వివాదం మానండి. మనమంతా భారతీయులం..మన మతం,కులం కూడా అదే. మనం అంతా కలిసి ఉందాం.. " అంటూ పాజిటివ్ గా ఈ వివాదాన్ని తొలిగించే ప్రయత్నం చేసారు.
ఇక 'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే పాత్రలను వెంటనే తొలగించాలని, రాష్ట్రంలోని బ్రాహ్మణులకు మంచు విష్ణు, మోహన్బాబు క్షమాపణ చెప్పాలని ఏపీ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి శిరిపురపు వెంకట శ్రీధర్ గుంటూరు లో డిమాండ్ చేశారు. చిత్రంలో బ్రాహ్మణులను చులకన చేసే సన్నివేశాలను వెంటనే తొలగించాలన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే చిత్రాలను నిలిపివేయాలన్నారు. మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని వెంటనే తొలగించటమే కాకుండా ఆయన బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్బాబు.


Click it and Unblock the Notifications











