నన్ను చేతులు పట్టుకుని నడిపించారాయన: మనీషా
తాను హీరోయిన్గా నటించిన 'మోక్ష' చిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, ఆయన మార్గదర్శకత్వం వల్లే మంచి సినిమాలు చేశానని నొక్కి చెప్పింది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆగస్ట్ 15న తుదిశ్వాస విడిచిన 65 ఏళ్ళ అశోక్తో తన అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్న మనీషా ''సినిమా పరిశ్రమలో నేను అడుగుపెట్టిన కొత్తలో నాకిక్కడ ఏమీ తెలీదు. అందువల్లే 'బాంబే' సినిమా స్క్రీన్ టెస్ట్ కోసం చెన్నై రమ్మని దర్శకుడు మణిరత్నం పిలిచినా వెళ్ళలేదు. ఈయన 'రోజా' అనే సినిమా తీశారని తెలుసు తప్ప మరింకేం తెలీదు. అయితే అశోక్ జీ వల్లే 'బాంబే' సినిమాలో నటించాను'' అని వివరించింది.
ఇక నా దృష్టిలో అశోక్ జీ అంటే ఏమిటో మాటల్లో చెప్పలేను. నాకు ఇంత గుర్తింపు, స్థాయి రావడానికి కారణం అయనే. నా మొదటి సినిమా 'సౌదాగర్'కి సినిమాటోగ్రాఫర్ ఆయనే. ఆ తర్వాత నా జీవితానికి మార్గదర్శకునిగా నా కెరీర్కు పురోగమనంలో ఇతోధికంగా తోడ్పడ్డారు''. సౌదాగర్ సినిమా చేస్తున్నప్పుడే నాకు 'మోక్ష' గురించి అశోక్ చెప్పారు. అయితే దీన్ని తీయడానికి ఆయనకు 10 సంవత్సరాలు పట్టింది. నాకు అశోక్ భార్య, కుటుంబం అంతా స్నేహితులే..'' అని చెప్పింది.
అలాగే శ్రీలంక నుంచి గౌతమ బుద్ధునిపై సినిమాకు దర్శకత్వం వహించే వచ్చినప్పుడు నేను చేసిన మొదటి పని అశోక్ను సంప్రదించడమే.. అయితే, అప్పటికే ఆయన క్యాన్సర్ బారిన పడ్డారని నాకు తెలీదు. అయినా అశోక్ నాతో ఉంటూ ఈ ప్రాజెక్ట్ స్కెచెస్ వేస్తూ, లొకేషన్ల గురించి మాట్లాడుతూ గైడెన్స్ ఇచ్చారు. ఆర్ట్ డైరక్టర్గా సమీర్ చందా, కాస్ట్యూమ్స్ కోసం భాను ఆదిత్యలను పెట్టుకున్నాం. ఈ క్రమంలో ఒక్కసారి కూడా అశోక్ అనారోగ్యం గురించి తెలీదు అని అశోక్ కి నివాళులు అర్పించింది మనీషా కొయరాలా.


Click it and Unblock the Notifications












