ప్రముఖ మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు ఇకలేరు
సినీ తెరపై మాటలతో మ్యాజిక్ చేసిన రచయిత ఎంవీఎస్ హరనాథ రావు ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఒంగోలు.
సినీ తెరపై మాటలతో మ్యాజిక్ చేసిన రచయిత ఎంవీఎస్ హరనాథ రావు ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఒంగోలు. ఎంవీఎస్ హరనాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దాదాపు 150 చిత్రాలకు పైగా ఆయన మాటలు అందించారు. ప్రతిఘటన, భారతనారి, స్వయంకృషి, సూత్రధారులు, రాక్షసుడు లాంటి చిత్రాలు మాటల రచయితగా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. హరనాథరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఎంవిఎస్ హరనాధరావు వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. అందుకే సినిమాల్లో ఆయన రాసిన మాటలు తూటాల్లా పేలేవి. హరనాథరావును ప్రముఖ దర్శకుడు, దివంగత టీ కృష్ణ సినీ తెరకు పరిచయం చేశారు. టీ కృష్ణ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాలకు ఆయనే మాటల రాయడం విశేషం. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం చిత్రాలకు ఉత్తమ సంభాషణల రచయితగా ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు.

హరనాథరావు తెలుగు సినిమా రచయితల సంఘానికి కోఆర్డినేషన్ కమిటీ చైర్ పర్సన్గా వ్యవహరించారు. రక్తబలి, జగన్నాథ రథచక్రాలు వంటి నాటికల్లో కూడా హరనాథరావు నటించారు.


Click it and Unblock the Notifications











