‘ఆరెంజ్’ నష్టాల నుంచి పుంజుకున్న నాగబాబు... ఇప్పుడు ఆస్థి ఎంతంటే?
'ఆరెంజ్' సినిమా నాగబాబును ఆర్థికంగా ఎంత దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా వల్ల ఉన్న డబ్బంతా పోగొట్టుకోవడంతో పాటు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. ఆ సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని నాగబాబు పలు సందర్భాల్లో స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సమయంలో సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆర్థికంగా చేయూతనివ్వడంతో నాగబాబు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడ్డారు. అప్పటి నుంచి ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. తన ఫోకస్ అంతా సినిమాల్లో నటించడం, టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంపై పెట్టారు.

నటనపై ఫోకస్ పెట్టిన నాగబాబు
‘ఆరెంజ్' మూవీ దెబ్బతో నష్టాల నుంచి బయట పడటానికి నాగబాబు... వరుస సినిమాల్లో నటించారు. గడిచిన 8 ఏళ్ల కాలంలో దాదాపు 30కిపైగా చిత్రాల్లో నటించారు. ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.

కలిసొచ్చిన టీవీ ఎంటర్టెన్మెంట్ రంగం
టీవీ రంగంలో నాగబాబు చేసిన కొన్ని సీరియల్స్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టారు. దీంతో పాటు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా వ్యవహరించడం, ఆ షో సూపర్ హిట్ కావడంతో ఆర్థికంగా బాగా కలిసొచ్చింది.

ఆర్థికంగా పుంచుకున్న నాగబాబు, ఆస్తి ఎంతంటే...
అలా ఆరెంజ్ సినిమా నష్టాల నుంచి తేరుకుని... మళ్లీ ఆస్తులు సంపాదించుకోవడంలో నాగబాబు సక్సెస్ అయ్యారు. నరసాపురం ఎంపీగా జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తుండటంతో నాగబాబు ఆస్థుల వివరాలు బయటకు వచ్చాయి. అఫిడివిట్లో తనకు, తన భార్యకు కలిపి రూ. 41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించారు. ఇందులో చరాస్తులు రూ. 36.73 కోట్లు, స్థిరాస్తులు రూ. 4.22 కోట్లు ఉన్నట్లు చూపించారు. దీంతో పాటు రూ. 2.70 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు.

ఇక రాజకీయాల్లో బిజీ బిజీ
ఇప్పటి వరకకు సినిమా, ఎంటర్టెన్మెంట్ రంగానికే పరిమితమైన నాగబాబు... జనసేన పార్టీలో చేరి నరసాపురం ఎంపీగా పోటీ చేయడం ద్వారా తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు నాగబాబు లో సినిమా కోణం మాత్రమే చూశాం... అతడిలోని రాజకీయ కోణం ఎలా ఉండబోతోంది అనేది మన్ముందు తెస్తుంది.


Click it and Unblock the Notifications











