'డమరుకం' కథ కాపీ కాదంటూ నాగార్జున వివరణ
హైదరాబాద్: ''అమిష్ త్రిపాఠి రాసిన 'ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహ' అనే వరుస పుస్తకాల్ని నేను చదివాను. వాటిని సినిమాగా తీస్తే బాగుంటుందని చాలా మందితో చెప్పేవాణ్ని. అంతే కానీ... ఆ రచనలకీ, 'డమరుకం' చిత్రానికీ ఎటువంటి సంబంధం లేదు. మెలూహ' పుస్తకాల్ని సినిమాగా తీస్తే వందల కోట్ల బడ్జెట్ అవసరమవుతుంది. ఆ హక్కుల్ని కరణ్జోహార్ కొన్నాడని తెలిసింది'' అంటూ నాగార్జున తెలియచేసారు. ఆ మధ్యన నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' కథ 'ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహ' పుస్తకం నుంచి తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో నాగార్జున ఇలా స్పందించారు.
అలాగే ఇటీవల అమిష్ నాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పాను. ఈ సినిమా కథేమిటో చెప్పాను. మీ రచనలకీ, మా 'డమరుకం' కథకీ ఎలాంటి పోలికలు లేవని ఆయనకు ఓ లేఖ కూడా రాసి పంపాను ' అన్నారు. ఇక రిలీజ్ విషయమై మాట్లాడుతూ... ''సంక్రాంతికి వారం రోజుల వ్యవధిలో నాలుగైదు సినిమాలు విడుదలవుతుంటాయి. అన్నీ బాగా ఆడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఆడతాయనే నమ్మకం నాకుంది. 'గబ్బర్సింగ్'తో పవన్కల్యాణ్ జోరుమీదున్నారు కాబట్టి... 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఎక్కువ థియేటర్లలో విడుదలవుతుంది. 'డమరుకం' చిత్రాన్నీ అదే స్థాయిలో విడుదల చేస్తున్నాం'' అన్నారు.
ఇక ''ఇదివరకటిలా హీరోలు అంతా కలిసి ఒక పౌరాణిక చిత్రం చేస్తే చాలా బాగుంటుంది. ఆ అవకాశం కోసం నేను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'మహాభారతం' తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందులో మీసమున్న ఏ పాత్రలోనైనా నటించడానికి నేను సిద్ధమే'' అన్నారు నాగార్జున. తన కుమారుడు అఖిల్ ఎంట్రి గురించి చెపుతూ... అఖిల్ లఘు చిత్రాల్లో నటిస్తూ తనను తానే తీర్చిదిద్దుకొంటున్నాడు. 'నాన్నా కథ ఇదీ. దర్శకుడు ఫలానా...' అని తనకు తానుగా నా దగ్గరికి వచ్చి చెబుతాడనే నమ్మకముంది. తనలో అంత స్పష్టత ఉంది అన్నారు. 'డమరుకం' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
సిక్స్ ప్యాక్ విషయమై మాట్లాడుతూ... ''చొక్కా విప్పి తెరపై కనిపించడం నాకు నచ్చదు. కానీ 'డమరుకం'లోని ఓ సన్నివేశానికి అలా కనిపించడం అవసరమని దర్శకుడు శ్రీనివాసరెడ్డి, ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు చెప్పారు. మరి చొక్కా తీశామంటే దేహం బాగా కనిపించాలి కదా... అందుకే కండలు పెంచాను. 'డమరుకం' క్త్లెమాక్స్ని గతేడాది నవంబరులో చిత్రీకరించాం. అదే సమయంలో 'రాజన్న' చిత్రంలో నటించాను. అందులో ధృఢంగా కనిపించాల్సి రావడంతో అప్పుడు బాగా కసరత్తులు చేశాను. అది 'డమరుకం' చిత్రానికీ పనికొచ్చింది. మామూలుగా నా దేహంపై సిక్స్ప్యాక్, ఫోర్ప్యాక్లు ఎప్పుడూ ఉంటాయి. ఒక నెల రోజులు బాగా కష్టపడితే అవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఛోటా కె.నాయుడు లాంటి ఛాయాగ్రాహకుడు పైనుంచి లైట్లు వేస్తే ఇక తిరుగే ఉండదు. 'శ్రీరామదాసు' చిత్రీకరణ సమయంలో కూడా నా దేహంపై ప్యాక్లున్నాయి. కానీ మేకప్ వేసి అవి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొన్నాను' అన్నారు.


Click it and Unblock the Notifications











