సాయి పాత్రతో నా జీవితం ధన్యమైంది : నాగార్జున
హైదరాబాద్ : సాయి పాత్రలో నటించడతో నా జీవితం ధన్యమైందని నటుడు నాగార్జున అన్నారు. రేపు ఆయన నటించిన 'షిరిడి సాయి' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ...భగవంతుడి దగ్గకు వెళ్లడం కష్టం, కష్టాలు భగవంతుడితో చెప్పుకోలేం. గురువుతో చెప్పుకుంటాం. అలాంటి సద్దురువే షిరిడి సాయి. సాయి తత్వం గురించి తెలుసుకుని మై మరిచి పోయా అని అన్నారు. షిరిడి సాయి చిత్రాన్ని ఎంతో పవిత్రంగా చేసానని చెప్పారు.
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ఎంతటి ఘటన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో వస్తోన్న 'షిరిడి సాయి' చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈచిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎంఎం కీవవాణి సంగీతం అందించారు. ఇందులోని పాటల్ని సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, శ్రీరామ జోగయ్య శాస్త్రి, వేదవ్యాస్, మేడిచర్ల సత్యనారాయణ మూర్తి తదితరులు వ్రాశారు. మొత్తం 14 పాటలుండగా.... ఎంఎం. కీరవాణి, మధు బాలకృష్ణ, సునీత, అక్కినేని నాగార్జున, శంకర్ మహ దేవన్, శ్వేతా పండిత్, దీపు, అదిథి పాల్, హరిహరన్, మాలవిక, ఎస్పీ బాలు, సోను నిగమ్, తీశనిగం, సాయికుమార్, రేవంత్, రాహుల్, చైత్ర తదితరులు పాడారు.
ఈచిత్రం విడుదల కోసం నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎ. సులోచనారెడ్డి సమర్పణలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి పతాకంపై ఎ. మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











