బ్రహ్మానందం ఇప్పుడు బోడి మల్లన్న
హైదరాబాద్ : తెలుగులో ఓ సామెత ఉంది...ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అని...ఇప్పుడు అదే పరిస్ధితి బ్రహ్మానందం విషయంలోనూ కనిపిస్తోంది. రేసుగుర్రం విజయంలో అధికశాతం బ్రహ్మానందం క్లైమాక్స్ లో చేసే హంగామాకే చెందుతుంది. ఓ రకంగా ఆ క్యారెక్టర్ పైనే సినిమా డిపెండ్ అయ్యింది. చివర్లో వచ్చిన బ్రహ్మానందం ఒక్కసారిగా సినిమాని లేపి నిలబెట్టాడు. అయితే నిర్మాత నల్లమలుపు బుజ్జి మాత్రం అది ఒప్పుకునేటట్లు కనపడటంలేదు. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ... రేసు గుర్రం చిత్రంలో, బ్రహ్మానందంవల్ల సినిమా ఆడిందని అందరూ అనుకుంటున్నారని కానీ, మంచి కూర చేశాక తాలింపు వేస్తే ఎలా వుంటుందో అలా బ్రహ్మానందం ఎపిసోడ్ వచ్చిందని ఆయన అన్నారు. అమ్మ సెంటిమెంట్ బాగా ప్రేక్షకులకు నచ్చింది, ఇద్దరు అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని తల్లి కోరుకున్న అంశం అందరికీ చేరింది అని చెప్పుకొచ్చారు.
అలాగే...'కథ, వినోదం, సాంకేతికత... ఇలా అన్నీ కుదిరాయి కాబట్టే 'రేసుగుర్రం' విజయం సాధించింది. వసూళ్లపరంగా పరిశ్రమలో నాలుగోస్థానాన్ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలకు ముందే లాభాలొచ్చాయి. పలుచోట్ల సొంతంగా సినిమాని విడుదల చేశాం. బలమైన భావోద్వేగాలున్న కథపై నమ్మకంతోనే సినిమాని మొదలుపెట్టాం. ప్రణాళిక ప్రకారం అనుకొన్న వ్యయంలోనే పూర్తి చేశాం. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోంది. ఓవర్సీస్లోనూ సినిమాకి చక్కటి ఆదరణ లభిస్తోంది. మా సంస్థలో 'లక్ష్మి'ని మించి ఈ చిత్రం విజయం సాధించింది. ఈ నెలాఖరున యాభై రోజుల వేడుక జరపబోతున్నాం'' అన్నారు.

ఇక ప్రస్తుతం రేసు గుర్రం చిత్రం విజయవంతంగా సాగుతోందని, అనుకున్నదానికన్నా మరింత షేర్ రాబట్టడం ఆనందాన్నిస్తోందని ఆయన తెలిపారు. ఇంత పెద్ద హిట్ అవడానికి ఈ చిత్రంలో కథ, కథనమే ముఖ్యమైనదని, అదేవిధంగా చిత్రంలో ఉన్న మిగతా పాత్రలు, వాటి తీరుతెన్నులు, కెమెరా పనితనం అన్నీ ఈ చిత్రంలో కుదిరాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఇంత పెద్ద హిట్ అయిన చిత్రం మరేది లేదని, నాలుగో వారంలో కూడా షేర్ వసూలు చేస్తోందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో పరిశ్రమ ఎక్కడ ఉంటుంది అన్నదానికి సమాధానం ఎక్కడ మంచి జరిగితే అక్కడ ఉండాలని తాను కోరుకుంటానని తెలిపారు. త్వరలో 'రేసుగుర్రం' చిత్రానికి అర్థశతదినోత్సవ వేడుకలు జరుపనున్నామని ఆయన వివరించారు
ఇక 'కిల్ బిల్ పాండే' పాత్ర చాలా ప్రస్టేషన్ తో ఊగిపోతూ సాగుతుంది. హీరోకి క్లైమాక్స్ లో తనకు తెలియకుండానే సాగుతుంది. ఈ పాత్ర కొద్దిగా బాద్షా లో బ్రహ్మానందం షేడ్స్ కలిగి ఉన్నా బాగా క్లిక్ అయ్యింది. బ్రహ్మానందం మాట్లాడుతూ... " నేను ఇప్పటివరకూ 987 సినిమాలు చేసాను. వాటిల్లో ఇది ఓ గుర్తుండిపోయే పాత్ర. ఈ విషయమై నేను సురేంద్ర రెడ్డి కి ధాంక్స్ చెప్తున్నా. సురేంద్రరెడ్డి ఈ చిత్రంలో నా పాత్ర చాలా సీరియస్ గా సాగుతుందని చెప్పాడు. నేను కన్ఫూజ్ అయ్యాను. అయితే ఇప్పుడు చాలా మంది ఈ పాత్ర తమకు బాగా నచ్చిందని చెప్పటం ఆనందాన్ని ఇస్తోంది. ," అన్నారు.


Click it and Unblock the Notifications











