ఏఎన్ఆర్ మృతి: జాతీయ మీడియా ఇలా చేసిందేంటి?
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే అక్కినేని గురించి జాతీయ మీడియా పట్టించుకోక పోవడంపై పలువురు తెలుగు సినిమా దర్శకులు అసంతృప్తి వ్యక్తం చేసారు. అక్కినేని గురించి సరైన కవరేజి ఇవ్వని జాతీయ మీడియా తీరును నిరసిస్తూ డైరెక్టర్ కొరటాల శివ, బివిఎస్ రవి తమ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసారు.
ఇదిలా ఉంటే...ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బిబిసి మన జాతీయ మీడియాకంటే అద్భుతమైన కవరేజ్ ఇవ్వడం గమనార్హం. బిబిసి తన పోర్టల్లో అక్కినేని మరణ వార్తను ప్రత్యేకంగా కవర్ చేసింది. ఇక మన తెలుగు మీడియా అంతా అక్కినేని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అద్భుతమైన కవరేజ్ ఇచ్చింది.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.
ఎన్నో బిరుదులు, సత్కారాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. ఆయన భార్య అన్నపూర్ణ కొన్ని ఏళ్ళ కిందట మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం స్ర్తి పాత్రలతో మొదలైంది. బతుకుతెరువు కోసం ఆయన నాటకాల్లో స్ర్తి పాత్రలు వేసేవారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అన్నిరకాల పాత్రలను పోషించిన అక్కినేని మొత్తం 256 చిత్రాలలో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం.


Click it and Unblock the Notifications












