‘బాహుబలి: దికన్క్లూజన్’కి గ్రాఫిక్స్ డిజైనర్ గా నిఖిల్, రాజమౌళితో ఫోన్ లో కామెడీ
హైదరాబాద్ : 'స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో కూడిన చిత్రాలతో యూత్లో స్టార్గా ఎదిగిన హీరో నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను అందిస్తున్నాం.
ఈ చిత్రంలో నిఖిల్కి జంటగా '21F ఫేం హెబాపటేల్', తమిళంలో 'అట్టకత్తి', 'ముందాసిపత్తి', 'ఎధిర్ నీచల్' లాంటి వరుస సూపర్హిట్స్లో నటించిన నందిత శ్వేతలు హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రం రీసెంట్ ట్రైలర్ మంచి ఆసక్తిని రేపుతూ సాగుతోంది.
రేపు థియేటర్లలోకి రానున్న ఎక్కడికి పోతావు ఈ చిత్రంపై.. హీరో నిఖిల్ తో సహా టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉంది. పోటీ అనేది లేకుండా సోలో రిలీజ్ కి ఛాన్స్ దొరికినా సరే..నిజానికి ఆనందపడే సందర్బం లేదు. సినిమాలను ఆదరించే ప్రేక్షకులు...ఎటిఎంల దగ్గర బ్యాంక్ ల దగ్గర క్యూలు కట్టి ఉంటున్నారు. దాంతో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియని సిట్యువేషన్. అయినా సరే...ధైర్యం చేసి వస్తున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు ఇక్కడ అందిస్తున్నాం.

సీసాతోనే..
ఓ సీసాతో మొదలైన కథ, ఆ సీసాతోనే ముగుస్తుంది. అందులో ఏముందనేది సస్పెన్స్. మరణించిన మనిషి 21 గ్రాములు బరువు తగ్గుతాడని సైన్స్ చెబుతోంది. ఆ 21 గ్రాములు ఏమైనట్టు? ఆత్మలు ఉన్నాయా? లేవా?.. ఇలా అంతు చిక్కని అంశాలు బోలెడున్నాయి. హారర్ కామెడీతో కూడిన ఫ్యాంటసీ ప్రేమకథా చిత్రమిది.

కథేంటంటే..
‘బాహుబలి: దికన్క్లూజన్'కి గ్రాఫిక్స్ డిజైనర్గా పనిచేస్తుంటాడు అర్జున్ (నిఖిల్). తనకి విజయవాడ అమ్మాయి నిత్య (హెబ్బా పటేల్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె ప్రేమలో పడిపోతాడు. అక్కడ నుంచి కథ టర్న్ తీసుకుంటుంది.

మరోకోణం ఉంది..
అయితే నిత్య ప్రవర్తన ఒకొక్కసారి ఒక్కోరకంగా ఉంటుంది. నిత్యలో తెలియని మరో కోణం ఉందని అర్జున్కి అర్థమవుతుంది. ఆ మరో యాంగిల్ ఏమిటనేది అర్దం కాదు. ఆ మేరకు అతను ప్రయత్నం చేస్తూంటాడు. నిత్య వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

బొర్రగుహల్లో
మరోవైపు తన స్నేహితుడు ( వెన్నెల కిషోర్)ని ఓ ఆత్మ వేధిస్తుంటుంది. అతనికి ట్రీట్మెంట్ ఇప్పించేందుకు బొర్రాగుహల్లో ఉండే మహిషాసుర మర్దనీ ఆలయానికి వెళ్తాం. అఖ్కడి నుంచి ఏం జరిగిందో చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే.. గ్రిప్పింగ్ సీన్స్ ఉంటాయి. అతణ్ని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి అర్జున్ ఏం చేశాడన్నది ఆసక్తికరం.

తెరపై కనిపించరు
ఈ చిత్రంలో 'బాహుబలి' చిత్రం గ్రాఫిక్ డిజైనర్గా కనిపిస్తాడు నిఖిల్ . రాజమౌళిగారితో ఫోనులో మాట్లాడే సీన్లు కామెడీగా ఉంటాయి. కానీ రాజమౌళి తెరపై కనిపించరు. ఆ సీన్స్ గురించి ప్రస్తావన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్తున్నారు.

హైలెట్స్
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాన్ని హైదరాబాద్, చిక్ మంగుళూరు, కర్నూలు తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. 62 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్కీ స్థానం ఉంది. 14 నిమిషాల పాటు గ్రాఫిక్స్ సన్నివేశాలుంటాయి. పతాక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారు.

ఫాంటసీతో కూడిన ప్రేమ కథ
‘‘ఇదో ప్రేమకథ. అందులోనే ఫాంటసీ జోడించాం. నిఖిల్కి తగిన కథ ఇది. పార్వతి పాత్రలో నందిత శ్వేత నటన కూడా ఆకట్టుకొంటుంది. ప్రతీ సన్నివేశం లాజిక్ ప్రకారమే సాగుతుంది. అందుకోసం కొంత రీసెర్చ్ కూడా చేశాను అన్నారు దర్శకుడు మాట్లాడుతూ

ప్రేక్షకుడు నమ్మేలాగే..
చనిపోయిన తరవాత మనిషి బరువు 21 గ్రాములు తగ్గుతుందని ఈ సినిమాలో ఓ డైలాగ్ వినిపిస్తుంది. అది సైంటిఫిక్గా రుజువైంది కూడా. అలా తెరపై ఏ సన్నివేశం చూపించినా ప్రేక్షకుడు నమ్మేలానే తీర్చిదిద్దాం. ఓ కొత్త తరహా స్క్రీన్ప్లేని ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలున్నాయి. అవి తెరపై చూస్తే థ్రిల్ అవుతారు'' అన్నారు దర్శకుడు.

ఇంకే హీరోకైనా చెప్చచ్చు
నిఖిల్ మాట్లాడుతూ...‘‘ఇంత మంచి కథ నన్ను వెదుక్కొంటూ రావడం నా అదృష్టం. ఆనంద్ అనుకొంటే ఏ హీరోకైనా ఈ కథ చెప్పి ‘ఓకే' చేయించుకోగలడు. ఈమధ్య నేను ప్రేమకథలు చేయడం లేదు. ఆ లోటు ఈ సినిమా తీర్చింది. ఇప్పటి వరకూ మీకు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని తెలుసు. కానీ.. తెరపై ఇంకా చాలామంది కనిపిస్తారు. వాళ్లు ఎవరన్నది ఇప్పుడే చెప్పం అన్నారు.

దెయ్యాలను, ఆత్మలనూ
ఈ సినిమాలో ప్రేమే కాదు.. ఫాంటసీ, వినోదం, థ్రిల్, హారర్ కూడా ఉంటుంది. దెయ్యాల్ని, ఆత్మలనూ ఈ సినిమాలో చూపిస్తున్నాం. అయితే అవేం ఇది వరకు చూసిన సినిమాల్లోలా ఉండవు. సీరియస్గా చెప్పాల్సిన కథ ఇది. అయితే... అలా చెబితే జనం చూడరు. అందుకే వినోదం మేళవించి చెబుతున్నాం అన్నారు హీరో నిఖిల్ .

ధియోటర్ లోనూ అదే స్పందన
ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం నవ్విస్తూనే ఉంటుంది. వెన్నెల కిషోర్ పాత్ర అందరికీ నచ్చుతుంది. ఆయన చేసే కామెడీ చూసి సెట్లో మేం పగలబడి నవ్వాం. థియేటర్లోనూ అదే స్పందన వస్తుందనుకొంటున్నా. తొమ్మిది నెలల కష్టం మా సినిమా. కచ్చితంగా అందుకు తగిన ఫలితం దక్కుతుంది'' అన్నారు నిఖిల్ .

బుద్ది వచ్చింది
'స్వామి రారా' నుంచి సెంటిమెంట్గా నా చిత్రాల్ని చూడడం మానేశా. ఈ చిత్రాన్ని చూడలేదు. చూసినోళ్లంతా బాగుందన్నారు. ఫెయిల్యూర్స్ సహజమే. అయితే, ఎవరి ఒత్తిడి వల్లో సినిమా లు చేయకూడదనేది 'శంకరాభరణం'తో అర్థమైంది. ప్రస్తుతం 'స్వామి రారా' ఫేమ్ సుధీర్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. చందూ మొండేటి 'కార్తికేయ-2' స్క్రిప్ట్ రెడీ చేశాడు అని నిఖిల్ చెప్పారు.

వీళ్ళంతా కలిసే...
బ్యానర్: మేఘన ఆర్ట్స్
తారాగణం: నిఖిల్, హెబ్బాపటేల్, నందితా శ్వేత, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సత్య, తాగుబోతు రమేష్, జోష్ రవి, వైవా హర్ష, సుదర్శన్, భద్రమ్, అపూర్వ శ్రీనివాస్ తదితరులు
పాటల- రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి,
ఆర్ట్- రామాంజనేయులు,
ఎడిటర్- చోటా.కె.ప్రసాద్,
సంగీతం-శేఖర్ చంద్ర,
మాటలు- అబ్బూరి రవి
పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరుశీను
డి.ఓ.పి- సాయి శ్రీరామ్, తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర,
నిర్మాత: పి.వి.రావు,
రచన, దర్శకత్వం: వి.ఐ. ఆనంద్
నిడివి: 140 నిమిషాలు,
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











