హీరోయిన్ అంజలిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
చెన్నై: హీరోయిన్ అంజలికి చెన్నైలోని సైదా పేట కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం దావా కేసులో హాజరు కావాలని పలు సార్లు ఆమెకు నోటీసులు జారీ చేసినా హాజరు కాక పోవడంతో ఆగ్రహానికి గురైన కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా అంజలి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అంజలికి అరెస్టు వారెంట్ జారీ చేయాలని పిటీషనర్ కళంజియం కూడా కోర్టును కోరారు.
పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు.
అంజలి తెలుగులో వెంకటేష్-రామ మల్టీ స్టారర్ 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన 'మద గజ రాజా' చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. తాను ఎక్కడికీ వెళ్లలేదని అంజలి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications












