సినీ రంగానికి మరో విషాదం నృత్య దర్శకుడు మృతి
ప్రముఖ నృత్య దర్శకుడు డి.వేణుగోపాల్ (94) చెన్నైలో కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం సాయంత్రం స్థానిక టి.నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పూడివాడ గ్రామానికి చెందిన వేణుగోపాల్ తెలుగుతో పాటు కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో మొత్తం 150కి పైగా సినిమాలకు నృత్య దర్శకుడిగా వ్యవహరించారు.

అన్ని భాషలలోను కలిపి సుమారు 150 చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన ఆయన, నాటి టాప్ హీరోయిన్లు సావిత్రి, వహీదా రెహమాన్, జమున తదితరులకు ఆయనే డ్యాన్స్ చేయడం నేర్పించారు. కన్నడ చిత్రాలు జేనుగోడు, కవిరత్న, కాళిదాస, అపూర్వ సంగమ, సతీ సక్కుబాయి మొదలైన చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ముద్దుబిడ్డ, అక్కాచెల్లెలు, సంతానం, సంకల్పం, దైవబలం, మాయింటి మహాలక్ష్మి, అత్తా ఓ ఇంటి కోడలే, మోహినీ భస్మాసుర (కన్నడ, బెంగాలీ) తదితర చిత్రాలకు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నటీమణులు సావిత్రి, వహీదా రెహ్మాన్, వాణిశ్రీ, జమున తదితరులు ఆయన వద్దనే నృత్యం అభ్యసించారు. 'వధూవరులు' సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన..

1958లో 'నవరస మంజరి', 1965లో 'ద ఇండియన బ్యాలెట్ సెంటర్ ఫైన్ ఆర్ట్స్' సంస్థల్ని నెలకొల్పి నృత్యానికి ఎంతో సేవ చేశారు. సృష్టి, జ్ఞాననేత్రం, నాట్యశాస్త్ర దర్పణం పుస్తకాలను కూడా రచించారు. వేణుగోపాల్ భౌతికకాయానికి బుధవారం ఉదయం టి.నగర్ కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


Click it and Unblock the Notifications











