విజయనిర్మల 'పనిరాక్షసి'.. ఆమె సినిమా అంటేనే అందరూ: పరుచూరి గోపాలకృష్ణ
ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సీనియర్ హీరోయిన్ విజయనిర్మల గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం యావత్ తెలుగు చిత్రసీమను శోకసంద్రం లోకి నెట్టేసింది. విజయ నిర్మల మృతి పట్ల పలువురు సినీ, రాజకీయా ప్రముఖులు తమ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా తాజాగా పరుచూరి గోపాలకృష్ణ విజయ నిర్మల గురించి కొన్ని విషయాలు చెప్పారు. తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో అయన మాట్లాడుతూ విజయ నిర్మల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా, దర్శకురాలిగా విజయనిర్మలది ప్రత్యేకమైన స్థానమని ఆయన అన్నారు. 44 సినిమాలకి దర్శకత్వం వహించిన ఆమె ఎంతో మందికి ఆదర్శనీయం అని చెప్పారు. తాను విజయనిర్మల గారిని 'పనిరాక్షసి' అని పిలిచే వాడినని గోపాలకృష్ణ అన్నారు. దర్శకురాలిగా 50 సినిమాలు పూర్తి చేయాలన్న ఆమె ఆశ నెరవేరక ముందే దేవుడు ఆమెను తీసుకెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. విజయనిర్మల సినిమాల్లో తాము కొన్నింటికి ఓని చేశామని, ఆమెకి కొంచెం కోపం ఎక్కువే అని గోపాలకృష్ణ అన్నారు. అయితే అది తామరాకుపై నీటి బొట్టు లాంటిది మాత్రమే అని చెప్పుకొచ్చారు.

విజయనిర్మలతో సినిమా అంటేనే అంతా క్రమశిక్షణతో ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. ఓ స్త్రీ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే విషయాన్ని ఆమె నిరూపించిందని, తనకు తెలిసినంత వరకు విజయనిర్మల గారు ఏ సినిమా కూడా నెల రోజులకి మించి తీయలేదని ఆయన తెలిపారు. విజయ నిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని, కృష్ణ మనసులో బాధలు పోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











