పవన్ ధూంధాం: తెలంగాణ పర్యటన తేదీలు
హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో.. జనసేన అధినేత, సినీ హీరో పవన్కల్యాణ్ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు.. ఇప్పటివరకు ఎన్డీఏ నిర్వహించిన సభల్లో మాత్రమే పాల్గొన్న పవన్..ఇక మరింత చురుగ్గా రాష్ట్రంలో ఆ కూటమి తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల విజయానికి కృషిసల్ఫనున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.కృష్ణయ్య, భాజపా నేతలూ ప్రచారంలో ఆయన వెంట ఉంటారు.
దీనిలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగే వివిధ సభల్లో పవన్ పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో తెదేపా- భాజపా తరఫున పోటీచేస్తోన్న అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్దికి అదే మార్గమని తన ప్రచారంలో ఆయన ప్రజలకు వివరించనున్నారు.

శుక్రవారం నుంచి నాలుగురోజుల పాటు ప్రచారం నిర్వహించనున్న పవన్...తొలిరోజు మహబూబ్నగర్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో, అనంతరం రాజధానిలోని వివిధచోట్ల నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12గంటలకు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్, 2.30 గంటలకు కల్వకుర్తి, 4 గంటలకు రాజధానిలోని సికింద్రాబాద్, 5 గంటలకు ఖైరతాబాద్, 7గంటలకు శేరిలింగంపల్లి బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11గంటలకు కరీంనగర్ జిల్లా రామగుండం, 12.30కు సిరిసిల్ల, 2 గంటలకు హుస్నాబాద్, 3.30కు వరంగల్ జిల్లా పాలకుర్తి సభల్లోనూ కల్యాణ్ పాల్గొంటారు.
27వ తేదీన ఉదయం 11గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, 12గంటలకు ఎల్బీనగర్, 2.30కు సనత్నగర్, 4గంటలకు ముషీరాబాద్, 6గంటలకు అంబర్పేటల్లో ప్రచారం నిర్వహిస్తారు. 28న ఉదయం 11గంటలకు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, 12.30కు కామారెడ్డి, 2గంటలకు బాల్కొండలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి పోటీచేస్తున్న తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్రావు, సికింద్రాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయల తరఫున ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇటీవలే పవన్ను కలిసి తమ నియోజకవర్గాలో పర్యటించాలని కోరారు.


Click it and Unblock the Notifications











