ఎన్టీఆర్ ఘాట్ వద్ద రచ్చ: ఆగిన ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ షూటింగ్, లక్ష్మి పార్వతికి డైరెక్టర్ వార్నింగ్!
లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా షూటింగును ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.ఇక్కడ షూటింగుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో దర్శకుడు కేతిరెడ్డి వాగ్వాదానికి దిగారు.
మహానటుడు, దివంగత ఎన్టీఆర్ జీవితంపై పోటా పోటీగా బయోపిక్ చిత్రాలు తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తన తీయబోయే 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను ఆదివారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు.
అయితే సినిమా ప్రారంభోత్సవ సమయానికి పోలీసులు వచ్చి ప్రారంభోత్సవం జరుగకుండా అడ్డుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద సినిమా చిత్రీకరణకు అనుమతి లేదని పోలీసులు వారిని అక్కడి నుండి పంపించేశారు.

పోలీసులు, దర్శకుడి మధ్య వాగ్వాదం
పోలీసులు అభ్యంతరం తెలుపడంతో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను అనుమతి తీసుకున్నానని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే అనుమతి పత్రంలో సినిమా పేరు, దానికి సంబంధించిన వివరాలు లేవని అందుకే ఈ షూటింగును అడ్డుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

లక్ష్మీ పార్వతికి దర్శకుడి వార్నింగ్
ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీసున్నామని, దీనికి లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని దర్శకుడు జగదీశ్వర్ రెడ్డి అన్నారు. లక్ష్మీ పార్వతి సహకరించని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి ఆమె నిజస్వరూపం బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఆవిడకు ఎందుకు అభ్యంతరం?
తాను తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్టీఆర్ మీద బయోపిక్ తీస్తున్నాను. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీయడం లేదు. ఆమె ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

కోర్టులో తేల్చుకుందాం
నా సినిమాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సినిమా తీసిన తర్వాత కోర్టులో తేల్చుకోవాలని, అక్కడ తాను ఎలాంటి కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందే తెలుసు. అన్నింటికీ సిద్ధపడే ‘లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా తీస్తున్నాను అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











