ప్రకాష్ రాజ్ ..ఫినిష్ చేసేసాడు
హైదరాబాద్ : ప్రముఖ నటుడు మరోసారి దర్శకుడుగా మారుతూ.. 'మనఊరి రామాయణం' పేరుతో కన్నడ తెలుగు భాషల్లో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ముగిసినట్టు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కర్ణాటక లోని కొడగు (కొడవనాడు) ప్రాంతంలో మెజారిటీ షూటింగ్ జరిగింది.
ఇక ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలకమైన పాత్రను పోషించింది. గతంలో మణిరత్నం రావణ్ సినిమాలో నటించిన ప్రియమణి ఇప్పుడు రామాయణంతో మరోమారు తెరమీదికి రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియమణికి ఓ కీలక పాత్రలో చేయించారని సమాచారం.
ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే... తనదైన విలక్షణ నటనతో ప్రకాష్ రాజ్ ఇప్పటికే తనేంటో రుజువు చేసుకున్నాడు. ఎలాంటి నటనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాష్ రాజ్. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన ప్రకాష్ రాజ్ నిర్మాతగా, దర్శకుడిగానూ తన సత్తా చూపించాడు. ఈ విలక్షణ నటుడు ఈ ప్రాజెక్టుతో మరోసారి మెగాఫోన్ పట్టి అలరించబోతున్నాడు.

ఇప్పటికే ''ధోని - ఉలవచారూ బిర్యాని'' వంటి సినిమాలతో దర్శకుడిగా తన టాలెంటును నిరూపించుకున్నాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించక పోయినా ప్రకాష్ రాజ్కు మాత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
తన సొంత నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ను చూసి ఇదేదో డ్రామా వేషాల వారి నేపథ్యంలో సాగే సినిమాగా అనిపిస్తోందనే ప్రచారం సాగింది. అయితే ఇది పక్కా విలేజ్ సినిమా అని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











