దళిత పోరాటం('రాజ్యాధికారం'ప్రివ్యూ )
హైదరాబాద్ :ప్రజలలో మమేకమై వారు పడుతున్న బాధలను గాధలుగా మార్చి సినిమాలు రూపొందించే ఆర్ నారాయణమూర్తి తాజాగా అందిస్తున్న చిత్రం రాజ్యాధికారం ఈ రోజున విడుదలవుతోంది. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నిర్మిస్తున్న 27వ చిత్రం ‘రాజ్యాధికారం'. ఇందులో ఆయన తండ్రి, ముగ్గురు కొడుకులుగా.. మొత్తం నాలుగు పాత్రలు పోషించడం విశేషం.
కథేమిటంటే...
రామయ్య (ఆర్.నారాయణమూర్తి) అనే రైతు కూలీ తన స్వశక్తితో పైకొచ్చి రైతుగా మారతాడు. ఈ ఎదుగుదల ఆ వూర్లోని పెత్తందార్లయిన పోలేరమ్మ (తెలంగాణ శకుంతల), ఆమె అన్న (భరణి) సహించలేరు. రాజ్యాధికారం వీళ్ల చేతిలో ఉందికదా అని... రామయ్య కుటుంబాన్ని, వర్గాన్నీ నానా ఇబ్బందులకు గురి చేసి చిత్రహింసల పాలు చేస్తారు. అలాంటి దశలో ఆ గ్రామంలోని ప్రజానీకం సహకారంతో ఆ కష్టాలనుంచి రామయ్య ఎలా బయటకు వచ్చి, తన హక్కుల్ని సాధించాడు? అనేదే 'రాజ్యాధికారం' సినిమా.
‘‘దళితులను, పేదలను పీక్కుతినే భూస్వాములు, పెత్తందార్లపై రామయ్య అనే పేద దళిత రైతు చేసిన తిరుగుబాటు ఈ చిత్రం. ఆయన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు చిన్నప్పుడే తప్పిపోయి, ఒకతను ముస్లిం కుటుంబంలో పెరిగితే, మరొకతను ఉద్యమకారుడిగా ఎదుగుతాడు. అమాయకుడైన ఇంకో కొడుకు తండ్రి దగ్గరే పెరుగుతాడు. నేడు సమాజంలో జరుగుతున్న వాస్తవిక అంశాలను తీసుకొని, ‘రాజ్యాధికారం' కోసం పెత్తందారులు చేసే అరాచకాలు ఎలా ఉంటున్నాయో, ఆ అరాచకాలకు సామాన్యులు ఎలా బలవుతున్నారో ఈ చిత్రంలో చూపించాను. ప్రారంభ సన్నివేశం నుంచీ పతాక సన్నివేశం వరకూ పాత్రలతో ప్రేక్షకులు సహానుభూతి పొందుతారు.

నారాయణ మూర్తి మాట్లాడుతూ...''రాజ్యాధికారం ఉంది కదా అని పెత్తనం చలాయిస్తూ ప్రశ్నించిన నేరానికి వూచకోత కోసుకొంటూ పోతే.. ఇది సభ్య సమాజమా? ఆటవిక రాజ్యమా? అని ప్రశ్నించేదే ఈ సినిమా. ఇందులో నేను నాలుగు విభిన్న పాత్రలు పోషించా. ఏడు పాటలున్నాయి. అన్ని పాటలకూ మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా 'వానమ్మా వానమ్మా వానమ్మా', 'పోయిరారా చిన్నితండ్రీ', 'జనక జజ్జనక' గీతాలు మరింతగా ఆకట్టుకొంటాయి'' అన్నారు.
చిత్రం: రాజ్యాధికారం,
సంస్థ: స్నేహ చిత్ర పిక్చర్స్
నటీనటులు: ఆర్.నారాయణమూర్తి, తనికెళ్ల భరణి (ద్విపాత్రలు), ఎల్బీ శ్రీరామ్, తెలంగాణ శకుంతల, పద్మావతీ నాయక్, అమరేంద్ర, కె.బి. ఆనంద్, రాంబాబు, వీరభద్రం, సైదులు, అయూబ్ తదితరులు.
పాటలు: వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, దయానర్సింగ్, గిద్దే రామనర్సయ్య, కమటం రామస్వామి,
నేపథ్యగానం: వందేమాతరం శ్రీనివాస్, కమటం రామస్వామి,
కథ, చిత్రానువాదం, మాటలు, ఛాయాగ్రహణం, కూర్పు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
విడుదల తేదీ: 21,నవంబర్ 2014.


Click it and Unblock the Notifications











