రాఘవేంద్రరావు, నాగార్జున భార్యకు ఝలక్, భూములు వెనక్కి
హైదరాబాద్: సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు, నాగార్జున భార్య అక్కినేని అమలకు జూబ్లీ హిల్స్లో కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వెనక్కి తీసుకోబోతోంది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ ఎం.కె.మీనా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. త్వరలో వీరి నుంచి ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకోనుంది.
రికార్డింగ్, రీ - రికార్డింగ్ థియేటర్ల నిర్మాణానికి, ఎడిటింగ్, అవుట్ డోర్ యూనిట్ సౌకర్యాల ఏర్పాటుకు రాఘవేంద్రరావుకు ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించింది. ఆ స్థలంలో మినీ థియేటర్స్ నిర్మించుకోవడానికి రాఘవేంద్రరావుకు గతంలో అనుమతి లభించింది. అయితే, ఆయన అందుకు విరుద్ధంగా మాల్ను, మల్టీప్లెక్స్ సినీమాక్స్ను నిర్మించారు. మిగిలిన స్థలాన్ని సినీ మాక్స్ పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు.
అదే విధంగా నాగార్జున భార్య అక్కినేని అమల నడుపుతున్న జంతు రక్షణ సంస్థ బ్లూక్రాస్ కోసం అర ఎకరం భూమిని కేటాయించారు. అయితే వీరు ఆ భూమిని ఎలాంటి పనులకు కేటాయించకుండా ఖాళీగా ఉంచారు. దీంతో ఆ భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీరితో పాటు ఆనంద్ సినీ సర్వీసెస్కు కేటాయించిన మూడు ఎకరాల భూమిని, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంటుకు కేటాయించిన 1247 చదరపు మీటర్ల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దివంగత సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా భూమి కేటాయింపును రద్దు చేస్తూ కూడా సమాచార, పౌర సంబంధాల శాఖ సిఫార్సు చేసింది.


Click it and Unblock the Notifications












