'కోచ్చడయాన్' టీజర్ కి ఆ టీజర్ కి దగ్గర పోలిక
హైదరాబాద్ :ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కోచ్చడయాన్'(విక్రమ్ సింహా). ఆయన కూతురు సౌందర్య ఆర్.అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ త్రీడీ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు. దీన్ని చూసిన కొంతమంది సినీ ప్రియులు ఇలాంటి ప్రచార చిత్రం ఎక్కడో చూసినట్లు ఉందే అని చర్చించుకొంటున్నారు.
ఇంతకీ ఎక్కడ చూసారంటే... 2007లో 'సుల్తాన్ ది వారియర్' పేరుతో ఓ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించేందుకు సౌందర్య ప్రయత్నించారు. వార్నర్ సంస్థతో కలిపి తమ స్వీయనిర్మాణ సంస్థలో దీన్ని నిర్మించేందుకు కృషి చేశారు. కొన్నాళ్లు చిత్రీకరించిన తరవాత, ప్రచార చిత్రం విడుదల చేశారు. అందర్నీ ఎంతగానో ఆకట్టుకొంది. అయితే ఆర్థిక సమస్యల మూలంగా ఈ సినిమాను పక్కనపెట్టినట్లు వార్తలొచ్చాయి. కోచ్చడయాన్' ప్రచార చిత్రంలో రజనీ వాడిన కత్తితోపాటు పాత్ర కూడా ఇంచుమించు 'సుల్తాన్' పాత్రను పోలి ఉందని అంటున్నారు. అయితేనేం... ప్రచార చిత్రానికి విపరీతమైన స్పందన వస్తోంది.

అయితే ఆ తరవాత సౌందర్య 'రాణా' సినిమాను రజనీతో నిర్మించాలని అనుకొంది. ముహూర్తపు సన్నివేశం రోజే రజనీ అస్వస్థతకు గురవడం, ఆ తరవాత చాన్నాళ్లు ఆయన చికిత్సకోసం విదేశాలకు వెళ్లడంతో ఆ సినిమా కూడా వాయిదా పడింది. 'రోబో' తరవాత రజనీ నటిస్తున్న 'కోచ్చడయాన్' కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీ పుట్టిన రోజున సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది.
ఇక సూపర్స్టార్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజు దృష్ట్యా ఈ టీజర్కి అనూహ్య స్పందన వచ్చింది. టీజర్ రిలీజైన తొలి మూడు రోజుల్లోనే 17లక్షల మంది యూట్యూబ్లో క్లిక్కులతో హోరెత్తించారు. ఇటీవలి రిలీజైన క్రిష్3, ధూమ్ 3 టీజర్లను మించి క్రేజు తెచ్చుకుంది. దేర్ ఆర్ హీరోస్, దేర్ ఆర్ సూపర్హీరోస్, బట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ రజనీకాంత్ .. అనే లైన్స్ టీజర్లో ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ టీజర్పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.
రజనీ కార్టూన్ షోలా ఉంది. రజనీ మార్క్ ఎక్కడా కనిపించలేదు అనేదే ఆ విమర్శ. ఏదేమైనా టీజర్కి స్పందన అనూహ్యం. 2డి, 3డిలో తెరకెక్కుతున్న భారీ గ్రాఫికల్ ఫాంటసీ చిత్రమిది. ఈ చిత్రానికి ఉపయోగించిన గ్రాఫిక్స్, ఎఫెక్ట్స కోసం ఆస్కార్ చిత్రం 'అవతార్'కి పనిచేసిన టీమ్ వర్క్ చేయడం విశేషం. రజనీకాంత్కి తెలుగులోనూ అద్భుతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'విక్రమసింహా' పేరుతో లక్ష్మి గణపతిఫిలింస్ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం రిలీజ్ చేస్తున్నారు. శరత్కుమార్, నాజర్, జాకీష్రాప్, ఆది, శోభన తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











