'ఆ ఛానెల్, పేపరు నా వెంట్రుకతో సమానం..': రామ్ చరణ్
హైదరాబాద్: 'నాయక్' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ తేజ్ స్పీచ్ కొంత వివాదానికి చోటిచ్చింది. పేరు చెప్పకుండా ఒక టీవీ చానల్, పేపర్ను టార్గెట్ చేసి, దూషించారు. చాలా సాదాసీదాగా ప్రసంగాన్ని ప్రారంభించిన చరణ్ .. కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఆడియో కార్యక్రమంలో మాట్లాడుతూ..'''బాబాయ్ పవన్ కళ్యాణ్ 'రచ్చ' ఫంక్షన్కి రాలేదని, ఒక చానల్, ఒక పేపర్ కథనాలు అల్లాయి. నా తర్వాతి సినిమా ఫంక్షన్కు కూడా ఆయన రాకపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి. మా కుటుంబం గురించి, మా బంధాల గురించి పెడర్థాలు తీసే విధంగా ఆ చానల్ ప్రసారం చేసినవి, ఆ పేపర్ రాసినవి నా వెంట్రుకతో సమానం'" అంటూ ఘాటుగా విమర్శలు చేసారు.
అలాగే ... ''ఈ వేదికపై నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చాడు. నాన్న పరిశ్రమలో ఉన్న రోజుల్లో ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే.. 'ముందు నాతో మాట్లాడి తర్వాత మా అన్నతో మాట్లాడు' అనేంత భరోసా బాబాయ్ ఇచ్చేవారు. ఇప్పుడు నాన్న పరిశ్రమలో లేరు. ఆ స్థానంలో బాబాయ్ ఉన్నాడు. నాన్న స్థానం బాబాయ్దే. నాది కాదు. ఈరోజు బాబాయ్ గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ముందు నాతో మాట్లాడి.. ఆ తర్వాత ఆయనతో మాట్లాడాలి" అని రామ్ చరణ్ అన్నాడు. ఈ మాటలతో అప్పటివరకు చల్లగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా వేడెక్కింది.
రామ్ చరణ్ సాధారణంగా చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఎవరైనా మీడియా వ్యక్తి కనిపించినా నవ్వుతూ పలకరిస్తారు. అయితే ఆయన తమ కుటుంబం మీద కామెంట్ చేస్తే మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. గతంలో దాసరి నారాయణరావు మీద ట్విట్టర్ లో యుద్దం లాంటిదే చేసారు. మళ్లీ ఇన్నాళ్లకు నాయక్ స్టేజీపై ఆయన ఇలా మాట్లాడి అందరినీ షాక్ కి గురి చేసారు. పవన్ కళ్యాణ్ ..రచ్చ ఆడియోకు రాలేదన్న విషయం మీడియాలో అప్పుడు హైలెట్ గా వచ్చింది. దానిపై ఆయన ఇప్పుడిలా స్పందించారు.
రామ్చరణ్ హీరోగా నటించిన చిత్రం 'నాయక్'. కాజల్, అమలా పాల్ హీరోయిన్స్. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. తమన్ స్వరాలు సమకూర్చారు. సోమవారం హైదరాబాద్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి సీడీని పవన్కల్యాణ్ ఆవిష్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖ స్వీకరించారు.


Click it and Unblock the Notifications











