పవన్ గెస్ట్ గా... 'నాయక్' ఆడియో విడుదల విశేషాలు (ఫొటోలతో)
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ్ చరణ్... 'నాయక్' ఆడియో విడుదలైంది. సోమవారం సాయింత్రం హైదరాబాద్లో ఆడియో ఆవిష్కరణ ఘనంగా కార్యక్రమం జరిగింది. తొలి సీడీని పవన్కల్యాణ్ ఆవిష్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖ స్వీకరించారు.
ఈ పంక్షన్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా నిలవటం మెగాభిమానులను ఆనందోత్సాహలలో ముంచెత్తింది. చాలా కాలంగా చిరంజీవికి,రామ్ చరణ్ కి మధ్యన విభేదాలు ఉన్నాయని, అందుకే రచ్చ ఆడియో కు సైతం పవన్ హాజరు కాలేదని వస్తున్న వార్తలను పవన్ ఆగమనం బహిరంగంగా ఖండించినట్లైంది. పవన్.. వేరే దేశంలో.. తన తాజా చిత్రం లొకేషన్స్ వేటలో ఉన్నా ఈ పంక్షన్ కోసం తీరిక చేసుకుని విచ్చేసి అందరినీ ఆనందపరిచారు.
పవన్ స్పీచ్ కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రామ్ చరణ్ ఓ ఛానెల్, పేపరుని ఉద్దేశించి స్పీచ్ లో అన్న మాటలు కూడా వాతావరణాన్ని వేడిక్కించాయి. ఇక ఈ వేడుకకు చిరంజీవి హాజరు కాలేకపోయారు. దాంతో రికార్డెడ్ మెసేజ్ పంపించారు.

ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్ నానక్ రామ్ గూడాలో జరిగింది. పవన్ కళ్యాణ్ సీడీని ఆవిష్కరించి చిరంజీవి సతీమణి సురేఖకు ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ- ''సరైన పరిస్థితులు, అవసరం ఉంటే తప్ప నాకు మాట్లాడాలని అనిపించదు. అందరూ సంతోషంగా ఉండాలి. చిత్ర పరిశ్రమలోని అందరూ కూడా మా కుటుంబంలోనివారే. చరణ్ డ్యాన్సుల్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క హీరో కుటుంబం నా కుటుంబంతో సమానం. అందరూ బాగుండాలి.. అన్ని సినిమాలూ బాగుండాలని కోరుకుంటున్నాను. చరణ్ డాన్సులు, ఫైట్స్, పెర్ఫార్మెన్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ సినిమా చరణ్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

చిత్ర హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ... ''నాన్న ఈ వేడుకకి రాలేకపోయారు. ఆ లోటుని పవన్ కల్యాణ్ బాబాయ్ తీర్చారు. మెగా ఫ్యామిలీలో నాన్న తరవాత నేను కాదు. ఆ స్థానం పవన్ బాబాయ్దే. ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే నేను వూరుకోను. నాకూ బాబాయ్కీ మధ్య ఎలాంటి ప్రేమ ఉందో మాకే తెలుసు. నేను చేయబోయే తరువాత సినిమా పాటల వేడుకకు కూడా మా బాబాయ్ రాకపోవచ్చు. అంతమాత్రానికే మా మధ్య ప్రేమ లేదనుకోవద్దు. ఇలాంటి లేనిపోని కథనాలు వస్తే నేను పట్టించుకోను. ఇలాంటి విషయాల గురించి ఓ పత్రిక, ఓ ఛానల్లో ఏం రాసినా అది నాకు వెంట్రుకతో సమానం. 37యేళ్లుగా మా మధ్య ఉన్న అనుబంధాన్ని ఏ ఛానల్ కూడా విడదీయలేదు.'' అన్నారు రామ్ చరణ్.
అలాగే ''వినాయక్ ఒక దర్శకుడు కాదు, నాకు ఇంకో బాబాయ్ లాంటివాడు. నన్ను ఒక పువ్వులా చూసుకొన్నాడు. నన్ను నమ్మి 'నాయక్' అనే పేరు పెట్టి సినిమా తీసినందుకు దానికి న్యాయం చేశానని అనుకొంటున్నాను. త్వరలోనే ఆయనతో మరొక సినిమా చెయ్యడానికి కూడా సిద్ధమే. తమన్ చాలా మంచి సంగీతం అందించాడు. కాజల్, అమలా పాల్ ఇద్దరూ కూడా పోటీపడి నటించారు'' అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ''చిరంజీవిగారిలా చేయడం ఎవరి వల్లా కాదు. ఆయన స్థాయిని చరణ్ మాత్రం అందిపుచ్చుకొన్నారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. చిరంజీవిని మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తుల్లో వినాయక్ ఒకరు. చరణ్ని ఏ విధంగా చూపించి ఉంటారో నేను వూహించగలను. ఒకప్పుడు రామ్చరణ్ని చిరంజీవి ఇమేజ్ను ముందుకు తీసుకెళ్లే ఖల్నాయక్ అని ఊహించుకున్నాను. ఇప్పుడు అది నిజమైంది. చిరంజీవి స్థాయిని చేరుకోగలిగిన ఏకైక నటుడు చరణ్ మాత్రమే. భారతదేశ చరిత్రలో ఏ నటవారసుడూ తండ్రి స్థాయి నటనను ప్రదర్శించలేదు. అది చరణ్కే సాధ్యమైంది'' అన్నారు.

వినాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చూసినవారికి మెగాస్టార్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ప్రతి సన్నివేశంలో చిరంజీవిలా కనిపిస్తాడు చరణ్. ఆకుల శివ మంచి కథ ఇచ్చాడు. తమన్ ఒక కొత్త సౌండ్ వినిపించాడు. ‘నాయక్' ఆహార్యం ఎలా ఉండాలి? అని నేను ఆలోచిస్తున్న సమయంలో చరణ్ ‘టక్' చేసుకుని వచ్చి, నా ముందు నిలబడ్డాడు. ఆ విధంగా నాయక్ ఎలా ఉంటాడో చూపించాడు. చిరంజీవి స్థాయిలో చరణ్ని నిలబెట్టే సినిమా ఇది'' అన్నారు.

హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ... చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు.

మరో హీరోయిన్ అమాలా పాల్ మాట్లాడుతూ.... ఈ చిత్రంతో తెలుగులో సెటిల్ అవుతానాన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

రాజమౌళి మాట్లాడుతూ... ఎప్పటిలాగే... పవన్, తన కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి పవన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. బాల్ ఆయన కోర్టులోనే ఉందని తెలియచేసారు.

పంక్షన్ కి హాజరు కాలేకపోయిన చిరంజీవి రికార్డు మెసేజ్ లో.... ‘‘నాయక్ పాటలు చూశాను. నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపించింది చరణ్ని చూస్తే. తెర మీద ‘నాయక్' చరణ్ కావచ్చు. కానీ తెరవెనక నాయక్ వినాయక్. తను నాతో తీసిన ‘ఠాగూర్'ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. అభిమానులకు కావల్సిన అంశాలు ఉన్నాయి'' అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాసన, అల్లు అరవింద్, శ్రీను వైట్ల, దిల్ రాజు, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











