ప్రశాంతంగా వెళ్లారు, రేపు అంత్యక్రియలు: హీరో వెంకటేష్
హైదరాబాద్: తన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతితో ఆయన కుమారుడు, తెలుగు సినీ హీరో వెంకటేష్ ముఖంలో విషాదం గూడు కట్టుకున్నట్లు కనిపించింది. బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన తన తండ్రి రామానాయుడు మరణించిన విషయాన్ని ప్రకటించారు. చాలా క్లుప్తంగా మాట్లాడి వెనుదిరిగారు.
నాన్నగారు ప్రశాంతంగా వెళ్లారని వెంకటేష్ అన్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు నాన్నగారు తుది శ్వాస విడిచినట్లు ఆయన తెలిపారు. రేపు గురువారం ఉదయం 9 గంటల నుంచి రామానాయుడి స్టూడియోలో అభిమానుల దర్శనార్థం నాన్నగారి భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

కాగా, రామానాయుడి స్వగ్రామం కారంచేడు నుంచి బంధువులు, అభిమానులు హైదరాబాదుకు బయలుదేరారు. తమ అభిమాన నిర్మాతను కడసారి చూడడానికి వారు హైదరాబాదుకు బయలుదేరారు. ప్రకాశం జిల్లా కారంచేడులో విషాద ఛాయలు నెలకొన్నాయి.
రామానాయుడు మించిన నిర్మాత తెలుగులో లేరు. చిత్ర సీమ అంతా ఆయనను విశేష గౌరవంతో ఆదరిస్తూ వచ్చారు. తన పేరు మీద ఓ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు ఆయన ఎన్నో అందుకున్నారు. ఓ నిర్మాతకు స్టార్ డమ్ రావడం రామానాయుడి విషయంలోనే జరిగింది.


Click it and Unblock the Notifications











