సెక్సీ హీరోయిన్ ఇక ఢిల్లీలో రాజకీయం (పిక్చర్స్)
బెంగుళూరు : కన్నడ హీరోయిన్ రమ్య ఇటీవల జరిగిన మాండ్యా లోక్ సభ ఉప ఎన్నికలో గెలుపొంది లోక్సభ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వెండి తెరపై తన సెక్సీ అందాలు, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించిన రమ్య ఇకపై ఢిల్లీలో రాజకీయం చేసేందుకు రెడీ అయింది. కన్నడ సీని పరిశ్రమ నుంచి లోక్ సభకు ఎన్నికైన తొలి నటి రమ్యనే కావడం విశేషం.
కన్నడ నాట రమ్యకు నటిగా మంచి పేరుంది. కన్నడలో ఆమె నటించిన పలు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. తెలుగులో ఆమె 'అమృత వర్షం', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' చిత్రాల్లో కనిపించింది. 1982లో జన్మించిన రమ్య అసలు పేరు దివ్య స్పందన. అయితే 2003లో 'అభి' అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసిన ఆమె తన పేరును రమ్యగా మార్చుకుంది.
2011లో యూత్ కాంగ్రెస్ పార్టీలో జాయినైన రమ్య ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన రీతిలో ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. పార్టీకి ఆమె చేసిన సేవకు ప్రతిఫలంగా మాండ్యా లోక్ సభ టికెట్ కేటాయించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రమ్య తన తండ్రిని కోల్పోయింది. ప్రచారంలో ఉండగా ఆమె తండ్రి ఆర్టి నారాయణ్ గుండె పోటుతో మరణించారు.

రమ్య జననం, పేరెంట్స్
మండ్య జిల్లాలో 1982 నవంబరు 29న జన్మించిన దివ్య స్పందన బాల్యం బెంగళూరులో గడిచింది. తల్లి రంజిత ఆమెను ఊటీలోని సెయింట్ హిల్డాస్ స్కూల్లో చేర్పించారు. తండ్రి దూరం కావడంతో పెంపుడు తండ్రి ఆర్.టి.నారాయణ్ అన్నీ తానై అండగా నిలిచారు.

సినిమాల్లోకి ఇలా...
ఊటీ, చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ స్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించింది. అనంతరం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బి.కాం చేరింది. డిగ్రీ చదువును సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. అదే సమయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

మొదటి సినిమా
రమ్య 2003లో చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. పవర్స్టార్ పునీత్రాజ్కుమార్కు జంటగా అభి సినిమాలో నటించింది. అంతకుమునుపే నినగాగి సినిమాలో అవకాశం వచ్చినా చివరి నిముషంలో చేజారిపోయింది. 'అప్పు' సినిమాలో హీరోయిన్ కోసం యత్నించినా అక్కడా నిరాశే ఎదురైంది. అభి సినిమా తరువాత అవకాశాలు ఒకదాని వెంట ఒకటిగా వెతుక్కుంటూ వచ్చాయి.

నటిగా గుర్తింపు
ఇప్పటి వరకు 38 సినిమాల్లో నటించింది. మరో ఆరు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. రమ్య అందచందాలు, అభినయం యువ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆమె నృత్యాలు ఉర్రూతలూగిస్తాయి. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూసేవారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆమె కొన్ని సినిమాలకు బ్రేక్ వేసింది.

రాజకీయాల్లోకి...
ఆమె వృత్తి, ప్రవృత్తి నటనే. కానీ రెండేళ్లలో ఒకదానివెంట ఒకటిగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని రమ్య రెండేళ్ల క్రితం యువజన కాంగ్రెస్లో చేరడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

పార్టీలో చురుకుగా..
బెంగళూరులోని శాంతినగర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్లో సభ్యత్వాన్ని స్వీకరించింది. పార్టీలో చురుకుగా పనిచేయడం ప్రారంభించింది. నగరంలో జరిగిన కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ సభలో పాల్గొంది. అప్పట్లో ఆమె రాష్ట్ర యువజన కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడడం ఖాయమంటూ వార్తలు గుప్పుమన్నా, అవి వాస్తవం కాలేదు.

రమ్యకు కలిసొచ్చింది
భాజపాతో జేడీఎస్ కుదుర్చుకున్న పొత్తు ఫలించలేదు. పైగా వికటించింది. పొత్తు కుదిరినట్లు కుమారస్వామి బహిరంగంగా ప్రకటించగా అదే స్థాయిలో దేవేగౌడ పొత్తు లేదని ప్రచారం చేశారు. ఇదేమి విడ్డూరం అని ఓటర్లు భావించారు. మండ్య జిల్లాలోని అంతర్గత కలహాలు జేడీఎస్ను దెబ్బతీశాయి. గత విధానసభ ఎన్నికల్లో కనీసం ఐదుగురు జెడీఎస్ అభ్యర్థుల పరాజయానికి పుట్టరాజు కృషి చేసినట్లు ఆరోపణలున్నాయి. వారంతా చెలువరాయస్వామి వర్గీయులు. వీరు పుట్టరాజు ఓటమికి కృషిచేశారు. ఇవన్నీ రమ్య గెలుపునకు కలసి వచ్చాయి.

గెలుపు తండ్రికే అంకితం
మండ్య ప్రజల రుణం తీర్చుకోలేనిదని నామినేషన్ వేసిన రోజునే తన తండ్రి గుండెపోటుతో మరణించినప్పటికీ ప్రజలంతా బిడ్డలా ఆశీర్వదించి మద్దతిచ్చారని సినీ నటి రమ్య పేర్కొన్నారు. కర్నాటకలోని మండ్య స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా తన గెలుపును తండ్రికి అంకితం చేస్తున్నానని ఆమె వెల్లడించారు.


Click it and Unblock the Notifications











