తొలి అనుభవం...హీరోయిన్ రమ్యకు జ్వరం!
బెంగుళూరు : కన్నడ నటి రమ్య తీవ్రమైన జ్వరం కారణంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరింది. రమ్య ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కర్నాటకలోని మాండ్యా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆమె కన్నడ సినీ పరిశ్రమ నుంచి లోక్ సభకు ఎన్నికైన తొలి నటిగా రికార్డులకెక్కింది.
ఎన్నికల కారణంగా గత కొన్ని వారాలుగా ఆమె ఎడతెరిపి లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండం వల్లనే ఆమె ఇలా అనారోగ్యం పాలైనట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీ వాతావరణ పరిస్థితులు కూడా ఆమె జ్వరం బారిన పడటానికి మరో కారణం. ఇంత కాలం సినిమా రంగంలో ఉన్న రమ్యకు....ఎన్నికలు, ప్రచారాలు, పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికవడం తొలి అనుభవంగా చెప్పుకోవచ్చు.

జ్వరం వచ్చిన విషయాన్ని రమ్య ప్రతినిధి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయింది. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తీవ్రమైన ఒత్తిడికి గురైందని, వైరల్ ఇన్పెక్షన్ కూడా తోడయిందని వైద్యులు వెల్లడించినట్లు ఆమె ప్రతినిధి తెలిపారు.
అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమె తన నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రమ్య 67,611 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఇప్పటి వరకు 38 సినిమాల్లో నటించింది. మరో ఆరు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. రమ్య అందచందాలు, అభినయం యువ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆమె నృత్యాలు ఉర్రూతలూగిస్తాయి. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూసేవారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆమె కొన్ని సినిమాలకు బ్రేక్ వేసింది.


Click it and Unblock the Notifications











