1940 బ్యాక్డ్రాప్తో రానా సంచలన చిత్రం... చారిత్రక నేపథ్యమున్న సినిమాకు దర్శక, నిర్మాతలు ఎవరంటే!
బాహుబలి సినిమా తర్వాత ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలకు తగినట్టుగా రానా దగ్గుబాటి తన చిత్రాల ఎంపికలో పరిణతిని చూపిస్తున్నారు. బాహుబలి తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ భళ్లాలదేవుడు తాజాగా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే తన అభిమానులను ఆకట్టుకొనేందుకు రానా మరోసారి పిరియాడిక్ ఫిలింతో ముందుకు వస్తున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరనే విషయాల్లోకి వెళితే...

అరణ్య మూవీతో రానా ప్రేక్షకుల ముందుకు
లాక్డౌన్ తర్వాత తొలిసారి రానా దగ్గుబాటి అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభు సల్మాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో మినహాయిస్తే తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. కానీ తెలుగు వరకు వస్తే ఈ సినిమా పాజిటివ్ టాక్తో ముందుకెళ్లినా.. ఆ టాక్ను నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు 10 కోట్లకుపైగా నష్టాలతో బాక్సాఫీస్ జర్నిని ముగించింది.

ఏప్రిల్ 30న విరాటపర్వం
ఇలాంటి పరిస్థితుల్లో రానా విరాటపర్వం సినిమాతో ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సాయిపల్లవి, నందితా దాస్, ప్రియమణి లాంటి అగ్ర హీరోయిన్లతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రానా ఈ చిత్రంలో నక్సలైట్గా విభిన్నమైన పాత్రను పోషించారు.

సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో
అయితే ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల కోసం తాపత్రయపడే రానా మరోసారి ఓ విభిన్నమైన చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసిన వెంకీ దర్శకుడిగా పరిచయమయ్యే సినిమాకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నట్టు తెలిసింది.

1940 పిరియాడిక్ బ్యాక్ డ్రాప్తో
అయితే తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న వెంకీ 1940లో జరిగే ఓ కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్లో జరిగి యాక్షన్, ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం. ఇటీవల వెంకీ చెప్పిన కథకు రానా వెంటనే ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కేందుకు మార్గం సుగమైంది.


Click it and Unblock the Notifications











